పవన్ పై ఒత్తిడి పెంచేస్తున్న వైసీపీ..! రంగంలోకి చంద్రబాబు కేబినెట్ ..!
ఏపీ రాజకీయాలు నెల రోజుల్లో పూర్తిగా మారిపోయాయి. నిన్న మొన్నటివరకూ పథకాల గురించో, చంద్రబాబు (Chandrababu) రెండేళ్ల పాలనా వైఫల్యాలపైనో ఎక్కువగా ఫోకస్ పెట్టిన విపక్ష వైఎస్సార్సీపీకి తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాలు వరంగా మారాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా విజయవాడలో ఓ కాపు యువకుడి లాకప్ డెత్, మరో దళిత యువకుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపాయి. ఇందులోనూ కాపు యువకుడు సాయికృష్ణను లాకప్ డెత్ చేసి చంపడమే కాకుండా శవాన్ని సైతం కాల్చేయడం ఆ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం నింపుతోంది. దీన్ని వైసీపీ పక్కాగా క్యాష్ చేసుకుంటోంది.
సాయికృష్ణ లాకప్ డెత్-వైసీపీ కాపుల భేటీ
తాజా పరిణామాలపై చర్చించేందుకు ఈ మధ్య కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులతో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఏర్పాటు చేసిన సమావేశం ప్రభుత్వాన్ని అలర్ట్ అయ్యేలా చేసింది. దీంతో ఈ సమావేశాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ కాపు రాజకీయాలు చేస్తోందంటూ సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో కాపు నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం ఆస్పత్రి పాలైతే ఆయనకు సరైన చికిత్స అందించడం లేదని, సొంత పార్టీ అధినేత జగన్ పట్టించుకోవడం లేదంటూ కూటమి ప్రచారం ప్రారంభించింది. అయితే ముద్రగడ ఎవరి సాయం ఆశించే మనిషి కాదంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

పవన్ ను ఒత్తిడిలోకి నెట్టే యత్నం
ఈ పరిణామాలన్నీ సహజంగానే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఒత్తిడి పెంచేస్తున్నాయి. సాయికృష్ణ మృతిపై పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై వైసీపీ నేతలు వరుసగా విమర్శలకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన పవన్ .. వారిపై బూతులతో రెచ్చిపోయారు. అలాగే తానొక్కడే మాట్లాడాలా, కూటమిలో మిగిలిన వారు మాట్లాడరా అని పవన్ ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు తాజా కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పవన్ పై వైసీపీ నేతలు విమర్శల దాడి చేస్తే తగిన కౌంటర్లు ఇవ్వాలంటూ మంత్రుల్ని ఆదేశించారు.

రంగంలోకి చంద్రబాబు కేబినెట్
అంతే కాదు నిన్న ఓ బహిరంగసభలో చంద్రబాబు వైసీపీ కాపు రాజకీయాలు చేస్తోందని, సాయికృష్ణతో పాటు అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ఏమైనా అంటే ఖబడ్డార్ అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో పవన్ ను తామేం అనలేదని, ఆయనతో పాటు చంద్రబాబు ప్రస్ట్రేషన్ లో ఏవేవే మాట్లాడుతున్నారంటూ నిన్న కాకినాడలో వైసీపీ కాపు నేతలు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. అంతిమంగా ఈ వివాదాలు పవన్ కళ్యాణ్ మౌనంపై ఒత్తిడి పెంచుతుండగా.. ఆయన కూటమికి దూరం కాకుండా ఉండేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.















Click it and Unblock the Notifications