శత్రు దుర్భేద్యంగా పాక్ కూటమి..! త్వరలో మరో దేశం చేరిక..!
ఇరాన్ వార్ తర్వాత అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు దేశాల ఆలోచనా విధానాన్నీ, ముఖ్యంగా లెక్కల్నీ మార్చేస్తున్నాయి. ఈ ఏడాది ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దం తర్వాత టెహ్రాన్ గల్ఫ్ దేశాల్ని టార్గెట్ చేసుకుంది. ఇందులో సౌదీ అరేబియాతో పాటు పలు దేశాలున్నాయి. గతంలో అమెరికాతో ఉంటే తాము సేఫ్ అని భావించిన గల్ఫ్ దేశాల మబ్బులు దీంతో విడిపోయాయి. ఈ నేపథ్యంలో గతంలోనే పాకిస్తాన్ తో కలిసి ఉమ్మడి భద్రతా కూటమి ఏర్పాటు చేసుకున్న సౌదీ అరేబియా, ఈసారి టర్కీతోనూ జట్టుకట్టింది. దీంతో మూడు దేశాలయ్యాయి. ఇప్పుడు నాలుగో దేశం ఇందులో చేరబోతోంది.
పాకిస్తాన్-టర్కీ-సౌదీ అరేబియా (Pakistan-turkey-saudi arabia)కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న భద్రతా కూటమిపై తాజాగా రెండు రోజుల క్రితం సంతకాలు చేశాయి. ఇందులో ఏ ఒక్క దేశంపై అయినా ప్రత్యర్థి దాడి చేస్తే అది ఉమ్మడిగా మూడు దేశాలపై జరిగిన దాడిగానే భావించేలా ఈ ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఈ కూటమిలో చేరడం ద్వారా తాము కూడా అలాంటి రక్షణ పొందవచ్చనే ఉద్దేశంతో మరిన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో ప్రధానంగా ఈజిప్ట్ (Egypt)ఉంది. కొన్ని సాంకేతిక విషయాలపై చర్చల తర్వాత తమ కూటమిలో ఈజిప్ట్ కూడా చేరే అవకాశం ఉందని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ వెల్లడించారు. ఇది సౌదీ కేంద్రంగా పనిచేస్తుందని, కానీ కూటమి లక్ష్యం ఇరాన్ కాదన్నారు.

తమ కూటమిని మూడు వ్యవస్థాపక దేశాలకు మించి విస్తరించాలని, ఇతర ప్రాంతీయ దేశాలను కూడా ఇదే చట్రం కిందకు తీసుకురావాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ కోరుకుంటున్నారని ఫిదాన్ తెలిపారు. ఎలాంటి దురాక్రమణకు అయినా వ్యతిరేకంగా సామూహిక నిరోధం కోరుతూ ఈ మూడు దేశాలు మొన్న మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం సభ్య దేశాలలో ఏ ఒక్కదానిపై సాయుధ దాడి జరిగినా, దానిని మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తారు. సాంకేతికంగా చూస్తే ఇది నాటో ఆర్టికల్ 5 పరస్పర రక్షణ నిబంధనను పోలి ఉంటుందని టర్కీ తెలిపింది. అలాగే సభ్య దేశాలలో ఏదో ఒకదానిపై దాడి చేస్తే తప్ప ఏ దేశాన్ని తాము ముప్పుగా పరిగణించబోమని కూడా వెల్లడించింది. నాటోలో రెండవ అతిపెద్ద సైనిక శక్తిని కలిగిన టర్కీ ఇందులో ఉండటం కూటమికి బలాన్ని తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications