బ్రహ్మోత్సవాల వేళ.. టీటీడీ అర్చకులకు ఎంపీ వేమిరెడ్డి దంపతుల కానుకలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. శనివారం నాడు 83,589 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,828 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.17 కోట్ల రూపాయల మేర కానుకలు టీటీడీకి అందాయి. 4.77 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. 7.04 లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు.. ఆరో రోజు. ఈ సందర్భంగా ఈ ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ హనుమంత వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

భక్తులలో అగ్రగణ్యుడు.. హనుమంతుడు. భగవంతునిపై అచంచలమైన భక్తి, సేవాభావం, శరణాగతికి ప్రతిరూపంగా ఆంజనేయుడిని పూజిస్తారు. గురుశిష్యులైన శ్రీరాముడు, హనుమంతుడి దివ్యసంబంధం భక్తి, జ్ఞానం, సేవాతత్వాల సమన్వయాన్ని చాటిచెబుతుంది. హనుమంత వాహనంపై కోదండరాముడి అవతారంలో శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు భగవద్భక్తి, ధర్మనిష్ఠ, శరణాగతి భావాలు మరింతగా పెంపొందుతాయని విశ్వాసం.
కాగా.. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో సేవలను అందిస్తోన్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఉద్యోగులు, లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీ పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి కానుకలు అందాయి. నెల్లూరు లోక్ సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి వారందరికీ నూతన వస్త్రాలను బహుమానంగా అందజేశారు.
తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమక్షంలో అర్చకులు, టీటీడీ సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సేవలందించే సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తోన్నారని, ఆ ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించారని అన్నారు.













Click it and Unblock the Notifications
