షెఫాలీ వర్మ ఊచకోత.. ఫైనల్కు చేరిన భారత్!
Asian Games 2026: జపాన్లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల రెండవ సెమీ-ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ను 114 పరుగుల భారీ తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత బౌలర్ల విధ్వంసకర ప్రదర్శన ముందు బంగ్లాదేశ్ కేవలం 81 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ భారీ విజయంతో డిఫెండింగ్ ఆసియా ఛాంపియన్ అయిన భారత్ ఫైనల్కు అర్హత సాధించింది. అక్కడ వారు శ్రీలంకతో తలపడతారు. వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడానికి భారత జట్టుకు ఇప్పుడు ఓ సువర్ణావకాశం లభించింది.
సెంచరీతో షెఫాలీ వర్మ విధ్వంసం
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మల ద్వారా అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. స్మృతి మంధాన 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వీరిద్దరూ తొలి వికెట్కు 5.6 ఓవర్లలో 72 పరుగుల విధ్వంసకరమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఓపెనర్ షెఫాలీ వర్మ బంగ్లాదేశ్ బౌలర్లను చితకబాది కేవలం 49 బంతుల్లోనే 9 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 100 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 204.08గా ఉంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేసింది. హర్మన్ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ మూడో వికెట్కు కీలకమైన 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరగా భారతి ఫుల్మాలి 5 బంతుల్లో 9 పరుగులు చేసి జట్టును 195/4 స్కోరుకు చేర్చింది.

81 పరుగులకే పరిమితమైన బంగ్లాదేశ్
196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ ఆరంభం నుంచే ఒత్తిడికి లోనవుతూ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 1.1 ఓవర్లలో 4 పరుగుల వద్ద జూరియా ఫెర్దౌస్ (0) రూపంలో బంగ్లాదేశ్ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత శోభనా మోస్తారి (4), కెప్టెన్ నిగర్ సుల్తానా (9), షోర్నా అక్తర్ (5) కూడా తక్కువ పరుగులకే ఔటయ్యారు. బంగ్లాదేశ్ తరఫున దిలారా అక్తర్ 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. 13 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేయగా.. ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను 81 పరుగులకే పరిమితం చేశారు. భారత్ తరఫున దీప్తి అద్భుతంగా బౌలింగ్ చేసి, తన 2.4 ఓవర్లలో 7 పరుగులకే 3 వికెట్లు పడగొట్టింది. నందిని శర్మ కూడా మూడు వికెట్లు తీసుకుంది. శ్రీ చరణీ రెండు వికెట్లు తీయగా, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ పడగొట్టారు.
ఫైనల్లో భారత్-శ్రీలంక ఢీ
తొలి సెమీఫైనల్లో గెలిచి శ్రీలంక జట్టు ఇప్పటికే ఫైనల్కు అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ఇప్పుడు ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు, తన స్వర్ణాన్ని నిలబెట్టుకుని, ఆసియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఇదే ఉత్తమ అవకాశం. సెమీఫైనల్స్లో పాకిస్థాన్ను ఓడించిన శ్రీలంక జట్టు కూడా చాలా బలంగా ఉందన్నది గమనార్హం. ఈ రెండు జట్లు ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్లో తలపడగా.. అందులో భారత్ విజయం సాధించింది.














Click it and Unblock the Notifications
