యూట్యూబర్ వైష్ణవి భర్త హత్యకేసులో కీలక పరిణామం!
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ హత్య కేసులో కీలక నిందితుడి అరెస్ట్ తో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైష్ణవి సోదరుడు సంతోష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈ వివరాలను వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. వైష్ణవిని హరిబాబు చంపాడని ఆరోపించిన వైష్ణవి సోదరుడు, బెయిల్ పై బయటకు వచ్చి నిజామాబాద్ లో తల దాచుకుంటున్న హరిబాబును హతమార్చాడు. హరిబాబును చంపిన తర్వాత సంతోష్ ఆంధ్రా వైపు పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు అతన్ని ట్రేస్ చేసి నిజామాబాద్ బైపాస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు.

తన సోదరి వైష్ణవిని హరిబాబు చంపాడనే కోపంలో ఉన్న సోదరుడు ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసి మరీ హరిబాబును హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యకు అతని తల్లి, మరో ఇద్దరు సోదరులు కూడా ప్రోత్సాహం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. కొంత కాలంగా హరిబాబును చంపాలనే ఆలోచనలో ఉన్నట్టు, హరిబాబును ఎందుకు వదిలేశారని అందరూ అడుగుతున్నట్టు, అందుకే హరిబాబును చంపి పగ తీర్చుకున్నానని వైష్ణవి సోదరుడు సంతోష్ వీడియోలో తెలిపాడు.
హరిబాబు కోసం వెతుకుతూ వచ్చిన నిందితులు అతన్ని చూసిన వెంటనే ముందుగానే తెచ్చుకున్న కత్తితో అకస్మాత్తుగా దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి కారులో పారిపోయారు.
పోలీసులు ఈ దాడిలో వాడిన స్విఫ్ట్ కారును, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా ప్రమేయం ఉన్న వారిని కూడా త్వరలో పట్టుకుంటామని కమిషనర్ చెప్పారు.
చట్టాన్ని ఎవరైనా తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని సాయి చైతన్య హెచ్చరించారు. యూ ట్యూబర్ వైష్ణవి మరణం వెనుక ఉన్న విషయాలు, ఆ తర్వాత జరిగిన హత్య.. ఈ కేసులో ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి.












Click it and Unblock the Notifications
