మమ్మల్ని ఫేక్ అంటారా ? డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల ఫైర్..!
గతేడాది ఏపీలో నిర్వహించిన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఎంపికై ఉద్యోగాలు పొందిన టీచర్లు (DSC 2025 Sports Quota Teachers) ఇవాళ విజయవాడలో భేటీ అయ్యారు. విపక్ష వైఎస్సార్సీపీ తమపై చేస్తున్న ప్రచారంపై వారు మండిపడ్డారు. తమపై ఆరోపణలు చేసిన టీవీ ఛానళ్లు, రాజకీయ నేతలు తాము సాధించిన సర్టిఫికేట్లు చూసేందుకు కళ్లు తెరవాలని కోరారు. తమపై కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో కష్టపడి క్రీడల్లో మెడల్స్ సాధించామని, రాజకీయాలు తమపై రుద్దొద్దంటూ టీచర్లు రాజకీయ పార్టీల్ని కోరారు. ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చిన తమను ఫేక్ అంటుంటే క్రీడల సమయంలో గాయపడినప్పుడు పడ్డ బాధకంటే వీరి మాటలే ఎక్కువ బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేంద్ర విభాగాల్లో కూడా ఉందని గుర్తుచేశారు. తపాలా, ఐటీ, డీఆర్డీఓ, రైల్వేలోనూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందని వారు తెలిపారు. సాఫ్ట్ బాల్ లో గతంలో మెడల్స్ సాధిస్తే గత క్రీడా శాఖామంత్రి రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి తమను కొండపల్లి ఖిల్లాపై పిలిచి సర్టిఫికేట్లు ఇచ్చి సన్మానాలు చేశారంటూ వీడియో, ఫొటోలు ప్రదర్శించారు.

అలాగే ఒక కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు రాకూడదా అని స్పోర్ట్స్ కోటా టీచర్లు ప్రశ్నించారు. క్రీడా కోడాలో హారిజంటల్ విధానంలో తమకు ఉద్యోగాలు దక్కాయని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అలాగే బ్రిడ్జి గేమ్ గురించి తెలియక పేకాట ఆడిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లు పేకాట ఆడి పాలకులుగా వచ్చారేమో అని ఎద్దేవా చేసారు. వాళ్లు అనుకునే పేకాట, గ్యాంబ్లింగ్లు క్రీడల్లో ఉండవన్నారు. తనను చాలా హీనంగా అవమానించారని మాజీ సైనికుడు చక్రపాణిరెడ్డి వాపోయారు. కష్టపడి చదివిన వాళ్లకే ఉద్యోగాల విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications
