టీచర్ల నియామకాలపై తేల్చేసిన సుప్రీంకోర్టు..! ఏపీలో డీఎస్సీ వివాదం వేళ..!
ఏపీలో ప్రస్తుతం మెగా డీఎస్సీ వివాదం నడుస్తోంది. గతేడాది కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయుల ఎంపిక పరీక్ష (DSC)లో అక్రమాలు జరిగాయని విపక్ష వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది. అలాగే దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మాత్రం డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులతో పదే పదే వివరణలు ఇప్పిస్తోంది. అదే సమయంలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్ధులు బయటికి వస్తుండటం ప్రభుత్వానికి సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ టీచర్ల నియామకాలకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చింది.
అస్సాంలో టీచర్ల నియామకాలపై దాఖలైన ఓ పిల్ పై విచారణ సందర్భంగా విద్యా హక్కు చట్టం, ఎన్సీటీఈ చట్టం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం ప్రకారం నిర్దేశించిన అర్హతలు లేని పక్షంలో, పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాన్ని నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైన అర్హతలు లేకుండా ఏ ఉపాధ్యాయుడినీ పాఠశాలలు లేదా కళాశాలల్లో నియమించకూడదని లేదా వారి సేవలను కొనసాగించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో జరిగిన డీఎస్సీ పరీక్షల్లో స్పోర్ట్ కోటా ఉద్యోగాలకు టెట్ పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగాలు ఇచ్చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఇది నిబంధనలకు విరుద్దమని వైసీపీ నేతలు చెప్తున్నారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పుబడుతూ రాష్ట్రంలో పలుమార్లు ఆందోళనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాలు డీఎస్సీ వివాదంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది చూడాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇప్పటికే జరిగిన నియామకాలకు సైతం వర్తించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
