Rahul Gandhi: మేం గెలిస్తే రాహులే ప్రధాని..! ఇండియా కూటమి మిత్రపక్షం కీలక ప్రకటన..!
ఢిల్లీలో విద్యార్ధుల ఆందోళనల తర్వాత దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా జెన్ జీ హవా కనిపిస్తోంది. దీంతో యువతకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ.. ఇండియా కూటమి తరఫున వచ్చే ఎన్నికల్లో ప్రధాని రేసులో ముందున్నారు. అయితే ఈ మధ్య తమిళనాడు సీఎం విజయ్ కూడా ప్రధాని రేసులో ఉన్నట్లు, ఆయనకు 9 శాతం జనం మద్దతిస్తున్నట్లు ఇండియా టుడే వెల్లడించిన సర్వే ఇండియా కూటమిలో చర్చనీయాంశమైంది. దీంతో ఇండీ కూటమి గెలిస్తే రాహులే ప్రధాని అని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ప్రధాని అభ్యర్థిత్వానికి టీవీకే అధినేత విజయ్ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, కాబట్టి ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీయే (Rahul Gandhi) ప్రధాని అభ్యర్ధి అవుతారని కేసీ వేణుగోపాల్ తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని మరో కీలక పార్టీ సీపీఎం కూడా రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచింది. ఈ మేరకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ (M.A.Baby).. రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షం విజయం సాధిస్తే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవిని ఆశించే హక్కు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ తెలిపారు. సాధారణంగా ప్రతిపక్ష నాయకుడికి ఆ హక్కు ఉంటుందని, అయితే, ఎవరు ప్రధానమంత్రి కావాలనే విషయంపై ఎన్నికల తర్వాతే చర్చించాలని బేబీ పేర్కొన్నారు. ప్రతిపక్షం మెజారిటీ సాధించిన తర్వాతే ప్రభుత్వ సారథ్యం ఎవరికి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. సరైన నిర్ణయానికి వచ్చేంత పరిణతి ఆయా పార్టీలకు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.














Click it and Unblock the Notifications
