కాకినాడ సుడి తిరిగింది.. ప్రధాని మోదీ బిగ్ అనౌన్స్మెంట్
ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బెల్జియం మధ్య దౌత్య బంధం మరింత పటిష్టమైంది. సాంప్రదాయ వాణిజ్య సంబంధాలను దాటుకుని రక్షణ, హరిత ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు ఇరుదేశాల సహకారం వేగంగా విస్తరిస్తోంది. భారత్లో మూడు రోజుల పర్యటనకు విచ్చేసిన బెల్జియం ప్రధాని బాట్ డి వెవర్ తో దిల్లీలోని జాతీయ రాజధాని వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు.
దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత బెల్జియం ప్రధాని భారత్లో పర్యటించడం, అందులోనూ బాట్ డి వెవర్ పదవిలోకి వచ్చాక మన దేశానికి రావడం ఇదే తొలిసారి కావడం ఈ పర్యటన ప్రాధాన్యతను పెంచింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. బెల్జియం భారత్కు సహజ రక్షణ, వాణిజ్య భాగస్వామి అని ఉద్ఘాటించారు.

"గతంలో కేవలం వజ్రాల వ్యాపారానికే పరిమితమైన మన సంబంధాలు, ఇప్పుడు అత్యాధునిక రక్షణ రంగానికి, క్లీన్ ఎనర్జీకి చేరుకున్నాయి. భారత్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేస్తున్న 'జోరావర్' రక్షణ ట్యాంకుల తయారీలో బెల్జియం భాగస్వామ్యం వహిస్తోంది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ కేంద్రంగా ప్రపంచంలోనే అత్యంత భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును సంయుక్తంగా నిర్మిస్తున్నాం" అని ప్రధాని సగర్వంగా ప్రకటించారు.
వ్యాపారులకు బిగ్ ఆఫర్.. ఐదేళ్లలో రెట్టింపు వాణిజ్య లక్ష్యం!
భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఆర్థిక అవకాశాలు పుష్కలంగా పెరిగాయని ప్రధాని తెలిపారు. బెల్జియం కంపెనీలు భారత్లో సులభంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా 'ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్ ట్రాక్ మెకానిజం'ను ఏర్పాటు చేశామన్నారు.
భారత్-బెల్జియం బిజినెస్ ఫోరమ్ను ఇకపై శాశ్వత యంత్రాంగంగా మారుస్తూ, రాబోయే ఐదేళ్లలో ద్విపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించారు. రక్షణ, పరిశోధన, విశ్వవిద్యాలయాలు, స్టార్టప్లతో పాటు ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు కల్పించేందుకు 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్' ఒప్పందంపై కూడా త్వరలోనే సంతకాలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ప్రపంచంలో అలజడులు ఉన్నా.. 7.8 శాతంతో దూసుకెళ్తున్న భారత్!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, సరఫరా వ్యవస్థల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయి స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. గత త్రైమాసికంలో దేశం 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందని, ఈ వృద్ధి ప్రయాణం ప్రపంచ దేశాలకు కొత్త నమ్మకాన్ని ఇస్తోందని కొనియాడారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లేదా పశ్చిమాసియా సంక్షోభం ఏదైనా సరే.. యుద్ధాల కంటే చర్చలు, దౌత్యం, చట్టబద్ధమైన నిబంధనల ద్వారానే శాంతి సాధ్యమవుతుందని భారత్, బెల్జియం ఇరుదేశాలూ బలంగా విశ్వసిస్తున్నాయని, ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం తమ ఉమ్మడి లక్ష్యమని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications