భీమిలిలో జగన్ కొత్త అస్త్రం..బొత్స అనూషకు వైసీపీ కీలక బాధ్యతలు..!!
ఉత్తరాంధ్ర రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయి. ప్రధానంగా భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ పదవికి, పార్టీకి మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శ్రీను రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకున్నాక అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. చిన్న శ్రీను ఎగ్జిట్తో భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్ ఎవరుంటారా అనే సస్పెన్స్ కొనసాగింది. గంటాను ఢీకొట్టాలంటే ఎవరైతే సరిగ్గా తూగగలరు అనే చర్చ వైసీపీ అధినాయకత్వంలో కొనసాగింది.ఎట్టకేలకు ఈ సస్పెన్స్కు తెరపడింది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో భీమిలి నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇంఛార్జ్ నియమితులయ్యారు.
భీమిలి ఇంచార్జ్ పై వీడిన సస్పెన్స్
విజయనగరం జడ్పీ ఛైర్మెన్ చిన్న శ్రీను వైసీపీని వీడిన తర్వాత వైసీపీలో కొంత ఆందోళన కనిపించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు అన్నిరకాలుగా హబ్గా నిలిచిన భీమిలి నియోజకవర్గంకు ఇంఛార్జ్గా కూడా వ్యవహరించిన చిన్న శ్రీను రాజీనామాతో అక్కడ వైసీపీ ఇంఛార్జ్ పదవి ఖాళీ ఏర్పడింది. ఇక భీమిలి నియోజకవర్గం గురించి రాజకీయంగా చెప్పక్కర్లేదు. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంత బలవంతుడో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ఆషామాషీ కాదు. చిన్న శ్రీను ఎగ్జిట్తో ఎవరిని అక్కడ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించాలో తర్జన భర్జన పడ్డారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్.

గుడివాడ అమర్నాథ్, కొండా రాజీవ్ లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే గంటాను ఢీకొట్టగలరా అనే చర్చ కూడా వైసీపీలో జరిగినట్లు సమాచారం. దీంతో ఈ సస్పెన్స్కు తెరదించుతూ...వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూషకు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకంతో మరోసారి జగన్ బొత్స కుటుంబం పైనే నమ్మకం ఉంచారని స్పష్టమవుతోంది.
ఇదిలా ఉంటే భీమిలి ఎమ్మెల్యేగా రాజకీయ ఉద్దండుడు అయిన గంటా శ్రీనివాసరావును.. రాజకీయాలను దగ్గరగా చూడటమే తప్ప ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేని డాక్టర్ బొత్స అనూష ఢీ కొట్టగలరా అనే సందేహాలు చాలా మందిలో రేకెత్తుతున్నాయి. అయితే భీమిలిలో స్థిరమైన నాయకత్వం లేకపోవడం, నమ్మిన వారే పక్కపార్టీలో చేరడంతో... ఈ సారి వచ్చే ఇంఛార్జి బలమైన పోటీనివ్వాలని భావించిన జగన్.. బొత్స కుమార్తెకు అవకాశం ఇచ్చారు. ఇక డాక్టర్ బొత్స అనూష.. బొత్స సత్యనారాయణకు రాజకీయ వారసురాలిగా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ కాబోతోంది. 2024 ఎన్నికల్లో బొత్స ఓటమి తర్వాత.. చీపురుపల్లి నియోజకవర్గం క్యాడర్ నిస్తేజానికి గురికాకుండా ఎప్పటికప్పుడు వారిలో జోష్ నింపుతూ తండ్రికి సహాయం చేశారు బొత్స అనూష.ఆ సానుకూల దృక్పథాన్నే గుర్తించి అధిష్టానం విశాఖ తీరంలో ఆమెను ప్రధాన అస్త్రంగా ప్రయోగించింది.
బొత్స అనూషకు కేక్ వాకేనా..?
భీమిలి నియోజకవర్గంలో వైసీపీ కేడర్ బాగానే ఉన్న స్థిరమైన నాయకత్వం అక్కడ లేదనేది స్పష్టం. పొలిటికల్ హంక్ గంటా శ్రీనివాసరావును ఢీకొట్టాలంటే పటిష్టమైన నాయకత్వం కావాలి. అయితే ఎన్నికల్లో గంటాపై ఓటమి చవిచూసిన నాయకులు మరో ఎన్నికల నాటికి వేరే నియోజకవర్గం వైపు చూస్తున్నారు. దీంతో క్యాడర్ ఉన్నప్పటికీ లీడర్ కరువు కనిపించేది.2024 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు 92 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.భీమిలిలో ఆయనకు బలమైన నెట్వర్క్ ఉంది. అయితే గంటాను ఢీకొట్టడం బొత్స అనూషకు అంత ఈజీగా అయితే ఉండదు. దాదాపు మూడున్నర లక్షల మంది ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం కుటుంబ నేపథ్యం ఉంటే సరిపోదు. అంతకు మించి రాజకీయ వ్యూహాలు, అస్త్రాలు సంధిచాల్సిన అవసరం ఉంది.బలమైన గంటా పొలిటికల్ స్ట్రాటజీని తట్టుకుని బొత్స అనూష ఎంతవరకు ముందుకెళ్లగలదనేది ఆమె ముందున్న అసలైన సవాలు.
బొత్స సత్యనారాయణ కూతురుగా ఆమెకు అవకాశం వచ్చిందిగానీ...గెలుపును మాత్రం బొత్స అనూష ప్రజాక్షేత్రంలో చేసే పోరాటంపైనే ఆధారపడి ఉంటుంది.చిన్న శ్రీను ఎగ్జిట్ తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీలో కొంత అలజడి ఆందోళన కనిపించినప్పటికీ... భీమిలి నియోజకవర్గం ఇంఛార్జి పదవిని తిరిగి బొత్స కుటుంబం వరించడం వైసీపీకి బూస్టింగే అని చెప్పాలి.













Click it and Unblock the Notifications
