భారత్ను నిందించడం కాదు.. పాక్ నీటి సంక్షోభానికి అసలు కారణం ఇదే!
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరి 66 ఏళ్లు నిండింది. ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో 1960 సెప్టెంబర్ 19న ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. గతంలో తీవ్ర యుద్ధాలు, దౌత్య సంక్షోభాలు ఉన్నప్పటికీ కొనసాగిన ఈ ఒప్పందం.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఒప్పందాన్ని నిలిపివేయడంతో అత్యంత క్లిష్టమైన దశకు చేరుకుంది. ఈ ఒప్పందం కింద సింధు బేసిన్లోని 6 నదులలో తూర్పు నదులు(రావి, బియాస్, సట్లేజ్) భారత్కు, పశ్చిమ నదులు(సింధు, జీలం, చీనాబ్) పాకిస్తాన్కు కేటాయించబడ్డాయి.
ఈ ఒప్పందం ప్రకారం మొత్తం సింధు నదీ వ్యవస్థ నీటిలో దాదాపు 80 శాతం నీరు పాకిస్తాన్కే దక్కుతుంది. భారత్కు విస్తారమైన భౌగోళిక ప్రాంతం, పెద్ద పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కేవలం 20 శాతం నీరు మాత్రమే అందుతోంది. ఎగువ పరివాహక దేశంగా భారత్ ఈ పరిమితులకు అంగీకరించనప్పటికీ.. దశాబ్ధాలుగా పాకిస్తాన్కు ప్రాధాన్యత లభించింది.

గతంలో యుద్ధాలు జరిగిన సమయంలో కూడా భారత్ ఈ ఒప్పందాన్ని గౌరవించడంతో భారత్ ఎప్పటికీ నీటిని అడ్డుకోదనే ధీమా పాకిస్థాన్ లో ఏర్పడింది. దీనివల్ల పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి మౌలిక సదుపాయాలు, నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది.
నీటి నిల్వ సమస్యలు
పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మౌలిక సదుపాయాల కొరత. తర్బేలా, మంగ్లా వంటి ప్రధాన ఆనకట్టల్లో పూడిక పేరుకుపోవడం వల్ల వాటి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ఆర్థిక, రాజకీయ, పరిపాలనాపరమైన వైఫల్యాల కారణంగా కొత్త ప్రాజెక్టులు నిలిచిపోయాయి. రుతుపవనాల సమయంలో భారీగా వచ్చే నీటిని నిల్వచేసే సామర్థ్యం పాకిస్థాన్ కు లేదు. ఈ తరుణంలో అత్యధికంగా నదీ జలాలు నిరుపయోగంగా అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి. నీటిని నిల్వ చేయలేక, కాలువల ద్వారా సరిగ్గా పంపిణీ చేయలేక పాకిస్తాన్ తన సొంత వైఫల్యాల వల్లే నీటి సంక్షోభంలో కూరుకుపోతోంది.













Click it and Unblock the Notifications
