ఏపీలో వైభవంగా నంది నాటకోత్సవాలు, కందుకూరి పురస్కారాలు.. ఎప్పుడంటే
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో తెలుగు నాటకరంగానికి పూర్వవైభవం తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జనవరిలో తెనాలిలో వైభవంగా నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో నంది నాటకోత్సవాల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
ఇక నాటక రంగ నాటకరంగ దిగ్గజాల జీవితకాల కృషిని గౌరవించే పురస్కారాలు అయిన కందుకూరి అవార్డులు జనవరి 10న ప్రదానం చేయనున్నట్టు తెలిపిన ఆయన పద్యనాటకం, సాంఘిక నాటకం, రచయితలు, సాంకేతిక నిపుణులు, నాటక సమాజం అనే 5 కేటగిరీల్లో పురస్కారాలను అందజేయనున్నట్టు ప్రకటించారు.28 జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లా నుంచి ముగ్గురికి కందుకూరి పురస్కారాలు ఇస్తామని వెల్లడించారు.

అక్టోబరులో నంది నాటకాల ఎంపిక కమిటీ నియామకం చేస్తామని, డిసెంబరులో ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన చేసి, జనవరిలోనే నంది నాటకోత్సవాల పురస్కారాల విజేతలకు సత్కారం చేయనున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాల తెలుగు నాటకాలకు నంది నాటకోత్సవాల్లో ప్రవేశానికి అవకాశం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తుందన్నారు.
కందుకూరి ప్రతిష్టాత్మక పురస్కారాలు 3 నుంచి 5కు పెంపు చేసినట్టు తెలిపారు. విజేతలకు రూ.1 లక్ష నగదు పారితోషికం ఇవ్వటం జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నాటక పరిషత్తులకు ప్రోత్సాహకంగా ఒక్కొక్క దానికి రూ.1 లక్ష కేటాయింపు చేస్తున్నట్టు తెలిపారు. సినిమా, టీవీ రంగాల నంది అవార్డుల నోటిఫికేషన్ ఈ వారంలోనే విడుదల ఉంటుందని, జనవరిలోగా అవార్డుల ప్రదానం చేస్తామన్నారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరహాలో వీడియోల ద్వారా నాటకాల ప్రాథమిక పరిశీలన జరుగుతుందన్నారు. కందుకూరి పురస్కారాల్లో భాగంగా 16 ప్రత్యేక అవార్డుల ప్రదానం ఉందన్నారు. వివిధ విభాగాల పరిధిలో మొత్తం 100 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు ఇస్తున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
స్థానం నరసింహారావు, ఆచార్య ఆత్రేయ, గరికపాటి రాజారావు, బండారు రామారావు తదితర ప్రముఖుల పేర్లతో ప్రత్యేక పురస్కారాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.బాలలు, విశ్వవిద్యాలయ విద్యార్థులకు నాటకరంగంలో ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. చలనచిత్ర, నాటక రంగానికి FDC ద్వారా త్వరితగతిన అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అనుసరిస్తున్నట్టు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.













Click it and Unblock the Notifications
