దీపం-2 పథకం రాయితీ మీ ఖాతాలో పడేది అప్పుడే!
ఆంధ్రప్రదేశ్లో దీపం-2 పథకం అమలవుతోంది. అయితే ఈ పథకం క్రింద ఇచ్చే రాయితీపైన మాత్రం ఎప్పుడు జమ అవుతుంది అన్నది లబ్దిదారులకు క్లారిటీ లేదు. ఫలితంగా ప్రభుత్వం లబ్దిదారులకు రాయితీ నగదు అందేలా చేసినా ఈ స్కీమ్ కు ప్రభుత్వం ఆశించిన, అనుకున్న మైలేజ్ రావటం లేదు.
దీపం-2 పథకం కింద ఇచ్చే ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల రాయితీని ఇకపై మరింత స్పష్టంగా, నిర్ణీత తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కొత్త విధానం రూపొందించబోతోంది. ప్రస్తుతం రాయితీ సొమ్ము ఎప్పుడు జమ అవుతుందో చాలా మందికి తెలియకపోవడం, కొందరికి ఒకటికి మించి ఖాతాలు ఉండటం వల్ల ఏ ఖాతాలో పడిందో గుర్తించలేకపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబరు 31న దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున సంవత్సరానికి మూడు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జూలై వరకు మొదటి సిలిండర్, ఆగస్టు నుంచి నవంబరు వరకు రెండో సిలిండర్, డిసెంబరు నుంచి మార్చి వరకు మూడో సిలిండర్కు రాయితీ వర్తిస్తోంది.
ప్రభుత్వం ఈ పథకం కోసం ఏడాదికి సుమారు రూ.2,900 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంతా ఖర్చు చేస్తున్నా ప్రజలలో మంచి ఆదరణ రాకపోవటంతో ప్రస్తుతం దీపం 2 పథకం అమలులో ఉన్న ఇబ్బందులను తొలగించే దిశగా అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుత విధానంలో ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని ముందుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లిస్తోంది. లబ్ధిదారుడు సిలిండర్ బుక్ చేసుకుని పూర్తి మొత్తం చెల్లించి తీసుకుంటారు.
తర్వాత రాయితీ సొమ్ము వారి ఖాతాలో జమ అవుతుంది. కానీ ఆ జమ తేదీ స్పష్టంగా లేకపోవడం వల్ల చాలా మంది అయోమయంలో పడుతున్నారు. కొత్త విధానంలో సిలిండర్ తీసుకున్న తర్వాతి నెలలో నిర్ణీత తేదీన రాయితీ జమ అయ్యేలా చూస్తారు. సెప్టెంబరులో సిలిండర్ తీసుకున్నవారికి అక్టోబరులో, అక్టోబరులో తీసుకున్నవారికి నవంబరులో రాయితీ విడుదల అవుతుంది. ఏ తేదీన జమ చేయాలనేది త్వరలో నిర్ణయిస్తారు.
ప్రతీ నెల నిర్దిష్టంగా ఒక తేదీ నిర్ణయం చేసి, అదే సమయానికి రాయితీ జమ చెయ్యాలని భావిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి ఇతర సంక్షేమ పథకాల తరహాలోనే అమలు చెయ్యాలని భావిస్తున్నారు. అంటే రాయితీ ఎప్పుడు వస్తుందో ముందుగానే లబ్ధిదారులకు తెలుస్తుంది.ఈ మార్పు అమలులోకి వస్తే లబ్ధిదారులకు మరింత పారదర్శకత, సౌకర్యం కలుగుతుంది. రాయితీ సొమ్ము ఎప్పుడు జమ అవుతుందో తెలిసి ఉండటం వల్ల వారు కూడా ఈ స్కీం విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తారు.












Click it and Unblock the Notifications
