యూపీఐ ఛార్జీలపై భారీ గందరగోళం.. ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి మినహాయింపు?
ప్రస్తుత డిజిటల్ యుగంలో నగదు రహిత లావాదేవీలు వేగంగా పెరిగిపోయాయి. షాపింగ్ మాల్స్, కిరాణా షాపులు, ఆన్లైన్ కొనుగోళ్ల నుంచి చివరికి టీ షాపుల వరకు అందరూ యూపీఐ, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లేదా స్వైపింగ్ మెషీన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ వెనుక మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) అనే కీలకమైన రుసుము ముడిపడి ఉంది. వ్యాపారులు, బ్యాంకులు, పేమెంట్ గేట్ వేల మధ్య జరిగే ఆర్థిక చక్రంలో మర్చంట్ డిస్కౌంట్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు లేదా మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. రూ.2000 దాటి పేమెంట్లు చేస్తే ఛార్జీలు పడతాయనే భయాందోళన వినియోగదారుల్లో నెలకొంది. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ వసూలు చేయనున్న నేపథ్యంలో ఈ ఎండీఆర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎండీఆర్ ఎలా పనిచేస్తుంది?
ఓ వినియోగదారుడు దుకాణంలో వస్తువును కొనుగోలు చేసి కార్డు లేదా డిజిటల్ విధానంలో డబ్బులు చెల్లించినప్పుడు ఆ పేమెంట్ సురక్షితంగా జరిగేందుకు బ్యాంకులు, నెట్వర్క్ ప్రొవైడర్లు, పేమెంట్ గేట్వేలు కలిసి పనిచేస్తాయి. ఆ సేవలను అందించినందుకు గాను ఆయా సంస్థలు వ్యాపారి నుంచి కొంత శాతాన్ని రుసుముగా వసూలు చేస్తాయి. ఆ మొత్తాన్నే మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) అంటారు. ఉదాహరణకు ఒక్క శాతం ఎండీఆర్ అంటే.. కస్టమర్ చెల్లించిన రూ.1000లో రూ.10 బ్యాంకులకు రుసుముగా వెళ్లి.. వ్యాపారి ఖాతాలో రూ.990 మాత్రమే జమ అవుతాయి. ఆ 10 రూపాయలు వ్యాపారి మాత్రమే భరించాల్సి ఉంటుంది. దాంతో వినియోగదారుడికి ఎలాంటి నష్టం జరగదు.

అయితే పెద్ద వ్యాపార సంస్థలు ఎండీఆర్ ఛార్జీలను సులువుగా భరించగలిగే అవకాశం ఉన్నప్పటికీ.. తక్కువ లాభం మార్జిన్లతో పనిచేసే చిరువ్యాపారులకు ఈ రుసుములు కాస్త భారంగా మారే అవకాశం ఉంది. అయితే సురక్షితమైన పేమెంట్ల నిర్వహణ, సైబర్ భద్రత పెంచడం, డిజిటల్ నెట్వర్క్ను నిర్వహించేందుకు బ్యాంకులకు ఈ ఎండీఆర్ ఆదాయం అత్యవసరమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. సమర్థవంతమైన ఎండీఆర్ విధానం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా నగదు రహిత సమాజం దిశగా అడుగులు పడతాయని అభిప్రాయపడుతున్నారు.
ఎంత ఛార్జీలు?
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పర్సన్ టు పర్సన్ నగదు బదిలీలకు ఎలాంటి ఎండీఆర్ ఉండదు. కొత్త ఎండీఆర్ విధానం ప్రకారం రూ.2,000కు మించిన పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తారు. రూ.2 వేల లోపు జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు వర్తించవు. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.300 మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుంది. అంటే రూ.75 వేలు పైబడిన లావాదేవీలన్నింటికీ రూ.300 మాత్రమే కట్ అవుతుంది. ఈ ఎండీఆర్ ఛార్జీలను వ్యాపారులే భరించాలి. నెలకూ రూ.లక్ష వరకు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా ఆదాయం పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ నుంచి మినహాయింపు ఉంది. టెలికాం, రైల్వేలు, పెట్రోల్, ఇన్సూరెన్స్, పబ్లిక్ యుటిలిటీ బిల్లులకు శాతంతో సంబంధం లేకుండా కేవలం రూ.5 ఫ్లాట్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది.
కస్టమర్ల నెత్తిన పెడతారు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
ఈ ఎండీఆర్ వినియోగదారుల నెత్తిన పడే ప్రమాదంపై తీవ్ర ఆందోళన నెలకొంది. వినియోగదారులతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. అదనపు ఖర్చును కస్టమర్ల నుంచే వసూలు చేస్తామని కొందరు వ్యాపారు చెబుతుండగా.. మరికొందరు యూపీఐ పేమెంట్లకు బదులుగా మళ్లీ నగదు చెల్లింపులను ప్రోత్సహించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వస్తువులు, సేవల ధరలు కూడా పెరిగే అవకాశముందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు యూపీఐ చెల్పింపుల వ్యవస్థపై కూడా భారీ దెబ్బ పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే చాలా మంది చిన్న వ్యాపారులకు, యూపీఐ వినియోగదారులకు అసలు ఎండీఆర్(మర్చంట్ డిస్కౌంట్ రేట్) అంటే అసలు అవగాహనే లేదు. ఈ తరుణంలో వారికి దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది.
ఎండీఆర్ గురించి చిరువ్యాపారులు ఏమంటున్నారంటే?
"యూపీఐ, డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ వస్తే మళ్లీ వినియోగదారులపైనే ప్రభావం పడుతుంది. చిరు వ్యాపారులకు చేసే చెల్లింపుల్లో నెలకు రూ.లక్ష వరకు ఎలాంటి ఛార్జీలు పడవని అంటున్నారు. ఆపై ఛార్జీలు పడితే చిరు వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. వారు ఈ నష్టాన్ని మళ్లీ వినియోగదాలపై మోపే అవకాశం కూడా ఉంటుంది. పెట్రోల్ బంకుల్లో రూ.2 వేలు దాటి జరిగే పేమెంట్లపై రూ.5 స్థిరంగా ఎండీఆర్ విధిస్తారని తెలిసింది. దీని మీద కూడా ఆందోళన నెలకొంది. మరి ఏం జరుగుతుందో అక్టోబర్ 15 వరకు వేచి చూడాల్సిందే." -పెట్రోల్ బంకు సిబ్బంది.
"మర్చంట్ డిస్కౌంట్ రేటా.. అంటే ఏంటి.. నాకు దాని గురించే తెలియదు. ఇప్పుడే మొదటి సారి వింటున్నా." -చిరు వ్యాపారి.

అవగాహన కల్పిస్తారా?
ఈ కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానం గురించి చాలా మంది వ్యాపారులకు కనీసం అవగాహన లేదు. ఏ లావాదేవీలకు వర్తిస్తుంది, వేటికి వర్తించదు అనే అంశాలపై వ్యాపారులతో పాటు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పేమెంట్ అగ్రిగేటర్లతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యాపారులకు కొత్త ఛార్జీల విధానాన్ని క్షుణ్ణంగా వివరించి అనవసర గందరగోళం లేకుండా చూడాలి. అవగాహన కార్యక్రమాల గురించి ఇదివరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
7 ఉచిత లావాదేవీలకు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు..
పర్సన్ టు పర్సన్: ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బులు పంపే పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు జీరో ఎండీఆర్ వర్తిస్తుంది. ఎలాంటి లిమిట్ లేదు. ఇతరుల నుంచి మీ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసిన ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
చిరు వ్యాపారులకు చేసే పేమెంట్స్: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన కిరాణా దుకాణం, స్థానిక వ్యాపారులకు చేసే పేమెంట్లపై నెలకు రూ.లక్ష వరకు ఎలాంటి ఛార్జీలు పడవు. ఎండీఆర్ కేవలం వ్యాపారులే చెల్లిస్తారని గుర్తుంచుకోవాలి.
రూ.2000 వేల లోపు వాలెట్ చెల్లింపు: పేటీఎం, ఫోన్ పే లేదా ఇతర ప్రీపెయిడ్ వాలెట్ల నుంచి రూ.2 వేల లోపు జరిపే వాలెట్ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు వర్తించవు.
ప్రభుత్వ సేవలకు లావాదేవీలు:ప్రభుత్వ ట్యాక్సులు, చలానాలు, సేవలకు యూపీఐ ద్వారా చేసే చెల్లింపులు
ఆన్ లైన్ ఈ-కామర్స్ ఆర్డర్లు: అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సైట్లలో చేసే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ ఛార్జీలు పడవు.
యూపీఐ ఆటోపే: బిజినెస్ బిల్లులు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు, సిప్ ల కోసం షెడ్యూల్ చేసుకునే ఆటో పేలపై ఎలాంటి ఛార్జీలు పడవు.
రూ.2 వేల లోపు పర్సన్ టూ మర్చంట్: బడా వ్యాపారులకు చేసే పర్సన్ టూ మర్చంట్ యూపీఐ లావాదేవీలు రూ.2 వేలలోపు ఉచితం. ఆ పైన చేసే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను వ్యాపారులే చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్రం నిఘా
కేంద్రం త్వరలో వసూలు చేసే ఎండీఆర్ వినియోగదారుల నెత్తిన పడే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొన్న తరుణంలో.. వ్యాపారి లావాదేవీలను నిత్యం పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను వినియోగదారుల ఖాతా నుంచి వ్యాపారి వసూలు చేయకుండా కేంద్రం భారీ చర్యలను చేపడుతోంది. అక్టోబర్ 15 నుంచి అమలు కానున్న విధానంపై కేంద్ర ప్రభుత్వం నిఘాను ఏ మేరకు పెట్టనుందో వేచి చూడాల్సిందే.















Click it and Unblock the Notifications
