BHEL: రాత్రికి రాత్రే కేజీల కొద్దీ వెండి మాయం, సీబీఐ ఎంట్రీతో బిగ్ షాక్
దేశంలోనే అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) పరిధిలోని ఒక కీలక పరిశోధనా కేంద్రంలో ఏకంగా కేజీల కొద్దీ వెండి మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న బీహెచ్ఈఎల్ సోలార్ సెల్ ప్లాంట్ నుంచి సుమారు 31.65 కిలోల వెండి ఉన్నపళంగా గాల్లో కలిసిపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. బహిరంగ మార్కెట్లో ఈ వెండి విలువ దాదాపు రూ. 71 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్లాంట్ ఉన్నతాధికారులు, మెటీరియల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్లపై కేసులు నమోదు చేసి అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిధులతో నడిచే ఈ ప్లాంట్లో సౌర విద్యుత్ కణాల (Photovoltaic Cells) తయారీ, రీసెర్చ్ కోసం వెండిని విరివిగా ఉపయోగిస్తారు. ప్లాంట్ రికార్డుల ప్రకారం 2020 వరకు దాదాపు 35.6 కిలోల వెండి అందుబాటులో ఉన్నట్లు చూపించారు. అయితే, గత ఏడాది ఫిబ్రవరిలో ఉన్నతాధికారులు ఇన్స్పెక్షన్ కు వచ్చి ప్లాంట్లోని లాకర్లను వెరిఫికేషన్ తనిఖీ చేయగా, అక్కడ కేవలం 3.95 కిలోల వెండి మాత్రమే కనిపించింది. దీంతో మిగిలిన 31.65 కిలోల వెండి మాయమైందని గ్రహించిన యాజమాన్యం సీబీఐకి ఫిర్యాదు చేసింది.

రికార్డులు మాయం.. కొరవడిన పర్యవేక్షణ!
సీబీఐ జరిపిన ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2018 వరకు ప్రతి ఏటా వెండి నిల్వలపై లెక్కలు తీసే ఆచారం ఉన్నప్పటికీ, 2019లో కొత్త ప్లాంట్ హెడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనిఖీలను పూర్తిగా నిలిపివేశారు. అంతేకాకుండా, స్టాక్ రిజిస్టర్లు, ఇన్వెంటరీ నివేదికలు, లాకర్ తాళాల పంపిణీకి సంబంధించిన కీలక పత్రాలు కూడా మాయమైనట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ప్లాంట్లో ఉన్న వెండి వాడకం, దాని నిల్వలపై ఎలాంటి పక్కా వ్యవస్థ లేకపోవడం వల్లనే ఈ భారీ చోరీ సాధ్యమైందని సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించింది.
ఉన్నతాధికారులపై సీబీఐ ఎఫ్ఐఆర్!
ఈ వ్యవహారంలో కుట్ర పూరితంగా వ్యవహరించడం, సాక్ష్యాలను మాయం చేయడం, నమ్మకద్రోహానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ BHEL ప్లాంట్ హెడ్ అండ్ అడిషినల్ జనరల్ మేనేజర్ డాక్టర్ భరత్ కుమార్ పంత్, మెటీరియల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ ఆశిష్ కుమార్లతో పాటు మరికొందరు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణలో భాగంగా ప్లాంట్ సిబ్బంది ఇచ్చిన సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో లంచాల నిరోధక చట్టం కింద సమగ్ర విచారణకు పూనుకుంది. ప్రభుత్వ సొత్తుకు రక్షణగా ఉండాల్సిన అధికారులే ఈ అక్రమానికి పాల్పడ్డారా లేదా అనే కోణంలో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది.














Click it and Unblock the Notifications
