SILVER: వెండి మార్కెట్లో మహా ప్రళయం.. భారీగా కుప్పకూలిన ధరలు!
బంగారంతో సమానంగా గాల్లో విహరించిన వెండి ధర ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. దాదాపు 40 శాతానికి పైగా ధరలు కుప్పకూలినా కొనుగోలుదారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఏడాదిలో 300 శాతానికి పైగా పెరిగి.. ఈ ఏడాది జనవరిలో కిలో రూ. 4 లక్షల మార్కును దాటేసిన వెండి, ఇప్పుడు ముంబై స్పాట్ మార్కెట్లో కేవలం రూ. 2.35 లక్షల వద్ద ఊగిసలాడుతోంది. పండుగల సీజన్ దగ్గరపడుతున్నా కొనుగోళ్లు పుంజుకోకపోగా, వ్యాపారుల వద్ద నిల్వలు పెరిగిపోతుండటం బులియన్ మార్కెట్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ధరలు విపరీతంగా పెరిగిన సమయంలో లాభాల ఆశతో వెండి నాణాలు, బిస్కెట్లు, వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టిన సాధారణ ఇన్వెస్టర్లు ఇప్పుడు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, మళ్లీ రూపాయి కూడా పెట్టడానికి ఎవరూ సాహసించడం లేదు. మార్కెట్లో మళ్లీ మునుపటి ఊపు వస్తుందన్న నమ్మకం సడలడంతో కొత్త పెట్టుబడులు రావడం పూర్తిగా ఆగిపోయాయి. పసిడి కంటే వేగంగా పెరిగిన వెండి, అదే స్థాయిలో పతనమవడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది.

దిగుమతి చేసుకున్న 2,000 టన్నుల వెండి గోదాముల్లోకేనా?
ఒకవైపు దేశీయంగా అమ్మకాలు లేక వ్యాపారులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు వారు ముందస్తుగా ఆర్డర్ ఇచ్చిన భారీ స్టాక్ భారత్కు చేరుకుంటోంది. భారతీయ బులియన్ డీలర్లు, రిఫైనరీలు దాదాపు 2,000 టన్నుల వెండిని విదేశాల నుంచి ఆర్డర్ చేశారు. భారత్ ఏటా సుమారు 7,000 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇప్పుడు దిగుమతి అవుతున్న ఈ కొత్త స్టాక్ను కొనేవారు లేకపోవడంతో గోదాముల్లో నిల్వలు పేరుకుపోతాయని, ఇది వ్యాపారుల వద్ద నగదు రద్దీని దెబ్బతీసి మరిన్ని తిప్పలు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అంతర్జాతీయ యుద్ధాలు.. కుదేలవుతున్న పరిశ్రమలు!
వెండి ధరల పతనానికి కేవలం సట్టా వ్యాపారమే కాక అంతర్జాతీయ పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం వెండి వినియోగం ఎక్కువగా ఉండే సోలార్ ప్యానెల్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలపై తీవ్రంగా పడింది. ప్రపంచంలోనే వెండిని ఎక్కువగా వాడే చైనా సోలార్ రంగానికి డిమాండ్ తగ్గడం, అలాగే పరిశ్రమలు వెండికి ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అల్యూమినియం, రాగి వైపు మళ్లుతుండటంతో వెండికి పారిశ్రామిక డిమాండ్ కూడా పడిపోయింది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి? తొందరపాటు నిర్ణయాలు వద్దు!
ధర తగ్గింది కదా అని స్వల్పకాలిక లాభాల కోసం వెంటనే వెండిలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కనీసం 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి ఉన్నవారు మాత్రమే దీన్ని ఒక అవకాశంగా చూడవచ్చని సూచిస్తున్నారు. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా, ప్రతి నెలా లేదా పక్షం రోజులకు ఒకసారి SIP పద్ధతిలో 'సిల్వర్ ఈటీఎఫ్'లలో కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. భౌతిక వెండిని దాచుకునే ఇబ్బంది లేకుండా ఈటీఎఫ్లు ఉపయోగపడతాయి.














Click it and Unblock the Notifications