శుక్రవారం ప్రార్థనల వేళ.. పాకిస్తాన్ లో భారీ పేలుడు: పలువురి దుర్మరణం
పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో సంభవించిన అత్యంత శక్తిమంతమైన బాంబు పేలుడు ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, భద్రత సిబ్బంది సంఘటన స్థలానికి చేనరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం దీనికి కారణమైంది. ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని కోహట్ సిటీలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన సంభవించింది. ఇక్కడి ఓల్డ్ పోలీస్ లైన్స్ లో శుక్రవారం ప్రార్థనలు జరుగుతోన్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం దూసుకొచ్చింది. ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రధాన ద్వారాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ మరుక్షణమే భారీ శబ్దంతో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి.

భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఓ మసీదు ప్రహరీగోడ కుప్పకూలింది. మసీదు ముందు భాగం ధ్వంసమైంది.పేలుడు జరిగిన ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న పలు భవనాల కిటికీలు, గోడలు సైతం దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా హాహాకారాలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ, రెస్క్యూ 1122 బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. ప్రమాదంలో గాయపడిన సుమారు 25 మందిని హుటాహుటిన కోహట్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురు పోలీసులు కూడా ఉన్నట్లు జియో న్యూస్ తెలిపింది. ఆసుపత్రికి ఒకేసారి పెద్ద సంఖ్యలో బాధితులు రావడంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు.
దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తోన్నామని కోహట్ పోలీసులు తెలిపారు. దాడి నేపథ్యంలో కోహట్-హంగు రహదారిని మూసివేశారు. సాధారణ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ ప్రాంతాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఓల్డ్ పోలీస్ లైన్స్ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టిన సాయుధ బలగాలు.. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టడానికి రంగంలోకి దిగాయి. సెర్చ్ అండ్ క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టాయి.
కాగా.. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తోన్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఇటీవలి కాలంలో భద్రతా బలగాలు, మతపరమైన ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోన్నప్పటికీ.. అవి పెద్దగా ఫలించట్లేదు. ఇలాంటి ఆకస్మిక వినాశకర దాడులు ఉగ్రవాద ముఠాల ఉనికిని చాటుతున్నాయి.














Click it and Unblock the Notifications
