UPI MDR Row: యూపీఐ ఛార్జీల వెనుక అమెరికా హస్తం ? తేల్చేసిన కేంద్రం..!
భారత్ లో 2 వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ఛార్జీలు (UPI MDR) విధిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకున్న నిర్ణయం విమర్శల పాలవుతోంది. గతంలో నోట్ల రద్దు సమయంలో యూపీఐ లావాదేవీలను పెంచాలనే లక్ష్యంతో కేంద్రం తీసుకున్న చర్యలతో జనం నగదు వాడటమే దాదాపుగా మానేశారు. ఇలాంటి సమయంలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించడాన్ని వ్యాపారులతో పాటు సాధారణ వినియోగదారులు కూడా జీర్ణించులేకపోతున్నారు. అమెరికాకు చెందిన వీసా, మాస్టర్ కార్డ్ లావాదేవీల్ని పెంచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ యూపీఐ ఛార్జీలపై వస్తున్న విమర్శలపై స్పందించింది. యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ప్రవేశపెట్టడం విదేశీ ప్రభావం వల్ల జరిగిందన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడమే ఈ చర్య లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. భారతదేశ యూపీఐ విధాన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకున్నవే అని, వినియోగదారులకు ఉచితంగానే ఈ సేవలు అందుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

స్వయం సమృద్ధిగల, సమ్మిళిత, సరసమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్మించాలనే స్పష్టమైన లక్ష్యంతో భారతదేశ యూపీఐ విధాన నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటున్నట్లు ఆర్దిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాబట్టి దీనిపై విదేశీ ప్రభావం ఉందన్న వార్తలను తోసిపుచ్చింది. అలాగే వ్యాపారులకు చేసే యూపీఐ చెల్లింపులలో 95 శాతం పైగా 2 వేల లోపే ఉన్నాయని, దీనివల్ల అత్యధిక సంఖ్యలో జరిగే చిల్లర లావాదేవీలపై ఎటువంటి ప్రభావం పడలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తేల్చేసింది. విపక్షాలు మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గి కేంద్రం ఈ ఛార్జీలను విధించిందని ఆరోపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications
