దానం నాగేందర్ పై అనర్హత వేటుతో కొత్త లెక్కలు, బై పోల్ - ఆ 8మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్..!!
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. ఎమ్మెల్యే పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేసింది. 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హుడిగా ప్రకటించింది. 2024లో దానం కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడాన్ని పరిగణలోకి తీసుకుని స్పీకర్ తీర్పును కొట్టివేసింది. ఖైరతాబాద్ సీటు ఖాళీగా గుర్తిస్తూ ప్రకటన చేసింది. కోర్టు అనర్హత వేటు వేయటంతో.. ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. దీంతో.. మిగిలిన ఆ 8 మంది ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి తప్పదని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ విజయం సాధించారు. అనంతరం 2024 మార్చి 17న కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దానం పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదంటూ స్పీకర్ ట్రిబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్రెడ్డి, కౌశిక్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.

ఉప ఎన్నిక ఖాయం.. కొత్త లెక్కలు
దానం నాగేందర్పై అనర్హత వేటుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుతో తదుపరి రాజకీయ, న్యాయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. దానం పార్టీ మారడం, కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం వంటి అంశాలను పిటిషనర్లు తమ వాదనల్లో ప్రధానంగా ప్రస్తావించారు. 2024లోనే దానం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కీలక అంశాన్ని తెర మీదకు తెస్తున్నారు. కాగా, పార్టీ మారిన మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని గులాబీ నేతలు చెబుతున్నారు. దీంతో... వారిలో ఆందోళన నెలకొందనే వాదన మొదలైంది. దానం సుప్రీంకు వెళ్లే అవకాశం ఉండటంతో.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీం లో కేవియట్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ఇక.. ఇప్పుడు ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల కోసం సిద్దం అవుతున్న వేళ.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాజకీయం గా మరింత ఉత్కంఠ పెంచటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
