ఉప ఎన్నికలకు ముందు విజయ్ సర్కార్ గోల్డ్ స్కీమ్.. అసలు కథ ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టీవీకే) ప్రభుత్వం మరో కీలక హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు పుట్టిన శిశువులకు ఓ గ్రాము బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. 'తాయ్మామన్ తంగ మోదిరం'(మేనమామ బంగారు ఉంగరం) పేరుతో ఈ పథకాన్ని సెప్టెంబర్ 28న అధికారికంగా ప్రారంభించనున్నారు.
అయితే జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులు కూడా ఈ పథకానికి అర్హులుగా ఉంటారు. వారికి కూడా బంగారు ఉంగరాలను అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అంటే పథకం అధికారికంగా ప్రారంభమైన అనంతరం మాత్రమే కూడా జూన్ 22 నుంచి అర్హత పొందిన శిశువులకు కూా ఈ ప్రయోజనం వర్తించనుంది.

అయితే ఉప ఎన్నికలు జరగనున్న మధురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో మాత్రం ఈ పథకాన్ని ప్రస్తుతానికి ప్రారంభించలేరు. ఈ పథకానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందలేదని ఈసీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అల్పాహారం పథకాన్ని విస్తరించేందుకు మాత్రం ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందినట్లు సమాచారం.
తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఈ పథకానికి రాజకీయ ఉద్దేశం లేదని, ప్రజల్లో ప్రభుత్వ ఆరోగ్య సేవలపై నమ్మకాన్ని పెంచడం, ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలని చెబుతోంది. అలాగే తమిళ సంప్రదాయంలో మేనమామ పుట్టిన శిశువుకు బంగారం బహుమతిగా ఇచ్చే ఆచారాన్ని ప్రతిబింబించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం వివరిస్తోంది.
తమిళనాడులో ప్రతి సంవత్సరం సుమారు 7.8 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో దాదాపు 99.9 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 4.2 లక్షల ప్రసవాలు జరుగుతుండగా.. ఇది మొత్తం ప్రసవాల్లో దాదాపు 53 శాతంగా ఉంది. సురక్షిత ప్రసవాలు, ఆరోగ్యకరమైన శిశువుల జననంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడులో శాశ్వత నివాసులైన తల్లులకు పుట్టిన శిశువులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం తల్లి PICMEలో నమోదయి ఉండటంతో పాటు RCH గుర్తింపు నంబర్ కలిగి ఉండాలి. ప్రతి బంగారు ఉంగరానికి ప్రత్యేక సీరియల్ నంబర్ ఉంటుంది. ఉంగరాలను ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ లో అందించనున్నారు.
ఈ స్కీమ్ తొలి దశలోనే 1.28 లక్షల బంగారు ఉంగరాలను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 107 కేంద్రాల ద్వారా వీటి పంపిణీ ప్రారంభం కానుంది. ఇకపై అర్హత కలిగిన శిశువులకు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే బంగారు ఉంగరాన్ని అందించనున్నారు. ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం రూ.755 కోట్లు కేటాయించింది. ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం వల్ల సంక్షేమ పథకాలపై రాష్ట్రంలో రాజకీయ చర్చకు అవకాశం ఏర్పడింది. అక్టోబర్ 6న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు ఈ పథకం తెరపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.













Click it and Unblock the Notifications
