విశాఖపట్నం బీచ్ లో ఇకపై..
ఏపీ సుదీర్ఘ తీర ప్రాంత పర్యావరణాన్ని సంరక్షించడం, సముద్ర కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని ప్రసిద్ధ ఆర్కే బీచ్ వేదికగా నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర పారిశుధ్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. అక్కడి పనులను పర్యవేక్షించారు. సముద్ర తీరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న క్షేత్రస్థాయి పనులను ఆయన పరిశీలించారు.
ఇందులో భాగంగా బీచ్ లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చేపల వలలను తొలగించే పద్ధతులపై స్కూబా డైవర్లు, వ్యర్థాల సేకరణ నిపుణులతో ముఖాముఖి మాట్లాడారు. సముద్ర జలాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను గుర్తించి వాటిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి వారు అవలంబిస్తున్న అత్యాధునిక విధానాలను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలోని వ్యర్థాల సేకరణతో అదనపు ఆదాయం వస్తోందని ఈ సందర్భంగా మత్స్యకారులు చంద్రబాబుకు వివరించారు.

తీర ప్రాంతాల రక్షణ కోసం చేపట్టిన సాగర స్వచ్ఛత ప్రాజెక్టు ద్వారా సముద్రం నుంచి సుమారు 1,200 టన్నుల ప్లాస్టిక్ చెత్తను వెలికితీయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్లాస్టిక్ సేకరిస్తోన్న స్థానిక మత్స్యకారుల సేవలను చంద్రబాబు ప్రశంసించారు. వ్యర్థాల నిర్వహణను మరింత వ్యవస్థీకృతం చేయడానికి పెద్దజలారిపేట వద్ద నూతనంగా నిర్మించిన ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్ను చంద్రబాబు ప్రారంభించారు.
దీనితో పాటు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీలు, మ్యాన్హోల్స్ శుభ్రం చేయడానికి ప్రవేశపెట్టిన అత్యాధునిక సీవరేజ్ రోబో ప్రదర్శనను ఆయన తిలకించారు. పారిశుధ్య కార్మికుల శారీరక శ్రమను తగ్గిస్తూ, ప్రమాదాలు జరగకుండా రక్షించే ఈ రోబోటిక్ వ్యవస్థ పనితీరును అధికారులు చంద్రబాబుకు వివరించారు.
ఈసందర్భంగా మురి మిక్స్చర్ ను చంద్రబాబు రుచి చూశారు. అక్కడ వ్యాపారం చేసుకుంటున్న మహిళతో సంభాషించారు. ఆమె ఆదాయ వనరుల గురించి ఆరా తీశారు. నిబంధనల ప్రకారం ఆమెకు పింఛన్ మంజూరు చేయాల్సిందిగా అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications
