భారత్కు కరువు గండం? ముంచుకొస్తున్న ముప్పు!
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం పర్యావరణ నిపుణులను, సైంటిస్టులను తీవ్ర ఆందోళనకు గురుచేస్తోంది. పసిఫిక్ సముద్ర జలాలు వేడెక్కడం వల్ల 'సూపర్ ఎల్నినో' ఏర్పడే ప్రమాదం ఉందని దేశవ్యాప్తంగా 180 మందికి పైగా శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు హెచ్చరించారు. ఈ వాతావరణ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో తీవ్రమైన కరువు, విపరీతమైన వేడిగాలులు, అడవులు, సముద్ర జీవుల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
సూపర్ ఎల్ నినో హెచ్చరికలు.. భవిష్యత్ ముప్పులు
పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న ప్రతి కదలికను సైంటిస్టులు ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తున్నారు. సాధారణ ఎల్ నినో కంటే ప్రమాదకరమైన 'సూపర్ ఎల్నినో' రూపుదిద్దుకంటే దాని ప్రభావం కేవలం సముద్రాలకే పరిమితం కాకుండా సమస్త మానవ మనుగడపై పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల వర్షపాతం గణనీయంగా తగ్గిపోయి దేశంలో కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. అంతే కాకుండా వ్యవసాయ రంగం, నదీ వ్యవస్థలు, సహజ ప్రాకృతి సమతుల్యత తీవ్ర ఒత్తిడికి లోనవుతాయని పరిశోధకులు వెల్లడించారు.

నైరుతి రుతుపవనాల నిష్క్రమణ
భారత్ నుంచి నైరుతి రుతుపవనాలు వెనుదిరుగుతున్న తరుణంలోనే ఈ భయాందోళనలు వ్యక్తమవ్వడం గమనార్హం. భారత వాతావరణ శాఖ ప్రకారం ఇప్పటికే పశ్చిమ రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు నిష్క్రమించాయి. రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రాజస్థాన్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు పంజాబ్, సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల నుంచి కూడా రుతపవనాలు పూర్తిగా వెనుదిరిగేందుకు అనుకూల వాతావరణం ఉంది. రుతుపవనాలు వెనుదిరిగిన క్రమంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం పట్ల వాతావరణ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న దేశీయ వర్షపాత గణాంకాలు
ఈ ఏడాది నమోదైన వర్షపాత గణాంకాలు అస్సలు ఆశాజనకంగా లేవు. ఈ ఏడాది జూన్ 4 నుంచి సెప్టెంబర్ 19 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా దక్షిణ ద్వీపకల్ప భారతంలో ఈ లోటు అత్యధికంగా29 శాతంగా ఉంది. నెలల వారీగా చూస్తే జూన్ నెలలో35 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా.. జులైలో సగటు కంటే కాస్త ఎక్కువ వర్షాలు పడ్డాయి. అయితే ఆగస్టు నెలలో కేవలం 213.3 మిల్లిమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది 2001 సంవత్సరం తర్వాత ఆగస్టులో నమోదైన ఏడో అత్యల్ప వర్షపాతంగా రికార్డయింది.
పరిశోధనలు, పర్యవేక్షణ పెంచాలని విజ్ఞప్తి
సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల, మారుతున్న వాతావరణ వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని సైంటిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు. సహజ వ్యవస్థలపై పడే ప్రభావాన్న సకాలంలో అంచనా వేయడానికి పర్యవేక్షణ, సైంటిఫిక్ పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని ప్రభుత్వాలకు, సంబంధిత శాఖలకు స్పష్టం చేశారు. మారుతున్న రుతుపవన సరళి, ఎల్ నినో ముప్పు దృష్ట్యా రాబోయే రోజుల్లో నీటి నిర్వహణ, వ్యవసాయ ప్రణాళికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది.












Click it and Unblock the Notifications
