ఆస్కార్ షాక్: రూ. 3000 కోట్ల బ్లాక్బస్టర్కు కేవలం 4 ఓట్లేనా?
ఆస్కార్ నామినేషన్ల ఎంపిక ప్రక్రియ ఇండియాలో మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ బ్లాక్బస్టర్ సినిమా 'ధురందర్' ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.3000 కోట్ల భారీ వసూళ్లను సాధించినప్పటికీ.. ఆస్కార్ రేసులో వెనుకబడిపోయింది. 99వ అకాడమీ అవార్డులకు(ఆస్కార్ 2027) భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ మరాఠీ థ్రిల్లర్ 'గోంధాల్'ను ఎంపిక చేయడంతో ఈ నిర్ణయం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వ్యతిరేకతకు దారితీసింది.
4 ఓట్లు మాత్రమే రావడంపై జ్యూరీ వివరణ
ఈ మొత్తం వివాదంపై జ్యూరీ సభ్యుల్లో ఒకరైన ప్రముఖ నిర్మాత వివేక్ వాస్వానీ స్పందిస్తూ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. 14 మంది సభ్యులతో కూడిన జ్యూరీ ప్యానెల్లో 'ధురందర్' సినిమాకు కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన వెల్లడించారు. ప్యానెల్లోని కొందరు సభ్యులకు ఈ సినిమా నచ్చినప్పటికీ.. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలపై పోటీపడే స్థాయి ఈ సినిమాకు లేదని జ్యూరీ అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయికి భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ సినిమాలో భారతీయ సంస్కృతి, మూలాలు ప్రతిబింబించలేదని జ్యూరీ భావించినట్లు పేర్కొన్నారు.

అభిమానుల ఆగ్రహం
బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసి రూ.3000 కోట్ల వసూళ్లను సాధించిన ఓ భారీ సినిమాకు కేవలం 4 ఓట్లు మాత్రమే రావడం ఏంటని ధురందర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన స్రవంతి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే బాక్సాఫీస్ హిట్లను ఆస్కార్ సెలెక్షన్ కమిటీ పదేపదే విస్మరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా 'గల్లీ బాయ్', 'పహేలి', 'ఏకలవ్య' వంటి సినిమాలను ఆస్కార్కు పంపినప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయని .. 'తుంబాడ్', 'బ్రహ్మయుగం' వంటి గొప్ప సినిమాలను పక్కనబెట్టారంటూ నెటిజన్లు పాత ఉదాహరణలను ప్రస్తావిస్తున్నారు.
'గోంధాల్' ఎంపికకు గల కారణాలు
మరోవైపు మరాఠీ చిత్రం 'గోంధాల్' ఎంపిక కావడం వెనుక ఉన్న కారణాలను వివేక్ వాస్వానీ వివరించారు. ఈ సినిమ మహారాష్ట్ర సాంప్రదాయ జానపద ఆచారమైన గోంధాల్' నేపథ్యంలో ఓ సస్పెన్స్ మర్డర్ మిస్టరీని మ్యూజిక్, డ్యాన్స్ పురాణ కథలతో కలగలిపి అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించిందని అన్నారు. అలాగే ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అందించిన అద్భుతమైన స్వరాలు, సంస్కృతిని ప్రతిబింబించే తీరు జ్యూరీని విశేషంగా ఆకట్టుకున్నాయని వెల్లడించారు. మొత్తం 33 సినిమాల పోటీ నుంచి జ్యూరీ చివరికి 'గోంధాల్', 'అంగ్', 'మైనే వాపస్ ఆవుంగా' సినిమాలను షార్ట్ లిస్ట్ చేసి.. చివరకు 'గోంధాల్' ను ఖరారు చేసింది.
బాక్సాఫీస్ హిట్టా? లేక సంస్కృతికి అద్ధం పట్టే చిత్రమా?
ఈ నిర్ణయం వల్ల భారతదేశపు ఆస్కార్ ఎంపిక విధానంపై మళ్లీ పాత చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన 'ధురందర్' లాంటి ఆధునిక కమర్షియల్ ఎంటర్టైనర్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలా? లేక మన నాటి సంస్కృతి జానపద మూలాలను చాటి చెప్పే 'గోంధాల్' లాంటి ప్రాంతీయ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? అనే ప్రశ్న సినీ విశ్లేషకుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications
