PM Kisan Maandhan Yojana: రైతన్నకు నెలకు రూ. 3 వేల పెన్షన్! ఎలా చేరాలంటే..?
వ్యవసాయం అంటే కేవలం విత్తనం వేయడం, పంట కోయడమే కాదు... పెట్టుబడి నుంచి వృద్ధాప్యం వరకు ప్రతీ దశలోనూ ఎన్నో సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తూ, వారి ఆర్థిక పునాదిని బలపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. వీటి ద్వారా నేరుగా నగదు బదిలీ, వృద్ధాప్యంలో భరోసానిచ్చే పెన్షన్, సాగు ఖర్చులకు సులభంగా లభించే రుణాలు అందుతున్నాయి. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ చాలామంది అర్హులైన రైతులు ఈ ప్రయోజనాలను పూర్తిగా అందుకోలేకపోతున్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆ మూడు కీలక పథకాల సమగ్ర సమాచారం ఇదిగో...
ఏడాదికి రూ.6 వేలు: పంట పెట్టుబడికి పీఎం కిసాన్ సాయం
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకాల్లో 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' ఒకటి. సొంతంగా సేద్యపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6,000 చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదికి మూడు విడతల్లో, విడతకు రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుతో పాటు ఇతర వ్యవసాయ అవసరాలకు ఈ నగదు ఎంతో ఉపయోగపడుతోంది.

ఈ లబ్ధి పొందడానికి భూమి వివరాల వెరిఫికేషన్తో పాటు ఇ-కేవైసీ (e-KYC), బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకింగ్ పూర్తి చేయడం తప్పనిసరి. అయితే సంస్థాగత భూ యజమానులు, కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను (IT) చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు. అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు (CA) వంటి వృత్తి నిపుణులకు ఈ సాయం వర్తించదు.
60 ఏళ్లు దాటితే నెలకు రూ.3 వేల పెన్షన్: 'పీఎం కిసాన్ మాన్ధన్'
వయసు పైబడిన తర్వాత చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే 'ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ పథకం' ముఖ్య ఉద్దేశం. ఈ పథకంలో చేరిన రైతులకు 60 ఏళ్ల వయస్సు పూర్తయిన తర్వాత ప్రతి నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ లభిస్తుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు, గరిష్టంగా 2 హెక్టార్ల (సుమారు 5 ఎకరాలు) వరకు సాగుభూమి ఉన్న రైతులు ఇందులో చేరడానికి అర్హులు.
వయస్సును బట్టి రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చందా చెల్లించాల్సి ఉంటుంది. రైతు ఎంత మొత్తమైతే జమ చేస్తారో, అంతే సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా వారి పెన్షన్ ఖాతాకు జమ చేస్తుంది. ఒకవేళ పెన్షన్ పొందుతున్న రైతు మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి నిబంధనల ప్రకారం 50 శాతం మొత్తాన్ని (రూ.1,500) కుటుంబ పెన్షన్గా అందిస్తారు. ఇది ఆ కుటుంబానికి వృద్ధాప్యంలో కొండంత అండగా నిలుస్తుంది.
మీ ఆధార్, బ్యాంక్ అకౌంట్, భూమి పాస్బుక్, ఫోన్ నంబర్తో కామన్ సర్వీస్ సెంటర్ లేదా https://maandhan.in/ లో అప్లై చేసుకోవచ్చు.
సాగు ఖర్చులకు రూ.5 లక్షల వరకు రుణం: 'కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC)'
పంట సాగు సమయంలో విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల, కూలీల ఖర్చుల కోసం రైతులకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. అటువంటి సమయంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి నష్టపోకుండా ఉండేందుకు 'కిసాన్ క్రెడిట్ కార్డ్' (KCC) ఎంతగానో తోడ్పడుతుంది. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు అందించేందుకు ఈ కార్డ్ ఉపయోగపడుతుంది.
కేవలం పంట సాగుకే కాకుండా పశుపోషణ, డైరీ, పౌల్ట్రీ, మత్స్య రంగాల్లో ఉన్న రైతులకు కూడా KCC ద్వారా రుణాలు ఇస్తారు. రైతుకున్న భూమి, వేసే పంట, సాగు ఖర్చులు, వారి ఆర్థిక అవసరాలను బట్టి బ్యాంకులు ఈ క్రెడిట్ లిమిట్ను నిర్ణయిస్తాయి. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు రూ.5 లక్షల వరకు రుణం లభించే అవకాశం ఉంది.
ఈ విధంగా నేరుగా నగదు అందించే పీఎం కిసాన్, వృద్ధాప్యానికి ధీమా ఇచ్చే మాన్ధన్, సాగు పెట్టుబడిని సులభతరం చేసే KCC కార్డ్... ఈ మూడూ కలసి రైతు సంక్షేమానికి బలమైన ముక్కోణపు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి.














Click it and Unblock the Notifications
