PM Kisan: పీఎం కిసాన్ డబ్బులకు ఇది తప్పనిసరి..! ఏపీలో 7.34 లక్షల మందికి షాక్..!
పీఎం కిసాన్ (PM-Kisan) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి మూడుసార్లు 2 వేల చొప్పున నిధులు జమ చేస్తోంది. ఈ పథకం కింద 24వ విడత డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ -నవంబర్ మధ్యలో ఈ నిధులు విడుదల కాబోతున్నాయి. అయితే పీఎం కిసాన్ నిధులు అసలైన రైతులకు అందించేందుకు, అనర్హులకు అడ్డుకట్ట వేసేందదుకు కేంద్రం ఇందులో ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదును తప్పనిసరి చేస్తోంది. దీంతో రాష్ట్రాలకు ఇబ్బందులు తప్పట్లేదు.
ఇదే క్రమంలో ఏపీలోనూ రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద ఈసారి డబ్బులు పడాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని ఐడీ తీసుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం లబ్దిదారులకు తేల్చిచెప్పేసింది. పీఎం కిసాన్ పథకంలో డబ్బులు పడాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో విశిష్ట సంఖ్యను తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని ఏపీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ తెలిపారు. రాష్ట్రంలో పీఎం కిసాన్ పథకానికి ఇప్పటివరకూ 64,71,800 మంది రైతులు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇందులో 52,06,777 మంది ఫార్మర్ రిజిస్ర్టీలో నమోదయ్యారని అధికారులు వెల్లడించారు. వీరు కాక మిగిలిన 7,34,215 మంది కూడా వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ పొందేందుకు సొంత భూమి కలిగి ఉన్న రైతులు.. వెంటనే స్దానిక అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. పీఎం కిసాన్లో ఈ ఏడాది తొలి విడత సాయం పొందినా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కాకపోతే మాత్రం అనర్హుల జాబితాలో చేరుస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో 7 లక్షల మందికి పైగా రైతులకు ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా మారింది.














Click it and Unblock the Notifications
