ఇండియన్ ఆయిల్ పై సుప్రీంకోర్టు రూ. 12 లక్షల భారీ జరిమానా
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం కొరడా ఝుళిపించింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా 12 లక్షల రూపాయల మేర భారీ జరిమానా విధించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు సైతం చేసింది సుప్రీంకోర్టు. ఐఓసీఎల్ వైఖరిని తిప్పుపట్టింది. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా భారీ జరిమానా చెల్లించాల్సిందేనని, ఇందులో ఎలాంటి రాజీధోరణి ఉండకూడదని ఆదేశించింది.
మహిళ.. అనే కారణంతో ఉద్యోగం నిరాకరించడంపై సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు గురైన హర్యానాకు చెందిన సుమిత్ర అనే మహిళకు ఈ రూ. 12 లక్షల పరిహారం చెల్లించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను ఆదేశించింది. ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లో రీఫిలింగ్ హెల్పర్ ఉద్యోగాన్ని మహిళ అనే ఒకే ఒక్క కారణంతో నిరాకరించడం పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

హర్యానాలోని కర్నాల్ జిల్లా గుర్హాకు చెందిన సుమిత్ర అనే మహిళ స్థానిక కమిటీ ద్వారా ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అప్పటి డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని స్థానిక కమిటీ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లో రీఫిలింగ్ హెల్పర్ లేదా క్యాజువల్ ఖలాసీ పోస్టుల కోసం అర్హులైన 49 మంది అభ్యర్థులను ప్రభుత్వానికి సిఫార్సు చేయగా అందులో సుమిత్ర ఒకరు. పురుషులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించి ఆమెను పక్కన పెట్టారు ఐఓసీఎల్ అధికారులు.
గ్యాస్ సిలిండర్లను మహిళలు ఎత్తలేరని, పైగా బాట్లింగ్ ప్లాంట్ లో రాత్రి వేళల్లో షిఫ్టులు ఉంటాయనే ఉద్దేశంతో ఆమెకు నియామక పత్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై సుమిత్ర న్యాయపోరాటానికి దిగారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎమ్ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఎల్పీజీ ప్లాంట్లో సిలిండర్లు ఎత్తడం చాలా శ్రమతో కూడుకున్న పని అని, అందుకే మహిళ ఈ ఉద్యోగానికి సరిపోరని భావించినట్లు ఐఓసీ తరఫు న్యాయవాది వాదించారు.
దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. దేశంలో మహిళలు నిత్యం ఇళ్లలో స్వయంగా గ్యాస్ సిలిండర్లను ఎత్తుతుంటారని గుర్తుచేసింది. అలాంటప్పుడు ప్లాంట్లలో వారు పని చేయలేరని నిర్ధారించడం ముమ్మాటికీ వివక్షేనని స్పష్టం చేసింది. ఈ పాతకాలపు వివక్షాపూరిత ఆలోచనా విధానాన్ని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. మహిళ అనే కారణంతో ఒక అభ్యర్థికి జీవనోపాధిని దూరం చేయడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, ఇదొక రకంగా మహిళా శక్తిని అవమానించడమేనని పేర్కొంది.
ఈ సుదీర్ఘ న్యాయపోరాటం తుది తీర్పు వెలువడే సమయానికి సుమిత్ర పదవీ విరమణ వయస్సుకు చేరుకున్నారు కూడా. ఈ దశలో ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కానందున ఆమెకు జరిగిన అన్యాయానికి తగిన ప్రాయశ్చిత్తంగా ఆర్థిక భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది. అందుకే ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి రూ. 12 లక్షల ఏకమొత్తం పరిహారాన్ని ఆమెకు చెల్లించాలని ఆదేశించింది.














Click it and Unblock the Notifications
