ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన సీఎం
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రపంచ దేశాల అధినేతలు కూడా మోదీని విష్ చేశారు. ఇక దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ప్రధాని మోదీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. దాంతోపాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి స్వయంగా సీఎం రక్తదానం చేశారు. అంతకుముందు శ్రీ ఖాతు శ్యామ్ విశాల్ ఆలయంలో 108 కుండీయ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని.. మానవత్వం పట్ల మన బాధ్యతను చాటుతుందని స్పష్టం చేశారు. అంతేకాక తన అవయవాలను దానం చేస్తానని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులతో సహా తన శరీరంలోని మొత్తం 14 అవయవాలను దానం చేసేందుకు ఆమె అంగీకరిస్తూ ప్రతిజ్ఞ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. అలాగే ప్రజల్లో అవయవదానంపై అవగాహన కల్పించి.. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రోత్సహించే ఉద్దేశంతో స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ తో పాటు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ప్రత్యేక అవయవదాన పోర్టల్ ను సీఎం రేఖా గుప్తా ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల కోసం ఒక ప్రత్యేక సేవా కేంద్రాన్ని కూడా స్టార్ట్ చేశారు.

ఈ సేవా కేంద్రానికి నమో శ్రామిక్ సేవా కేంద్రం అని పేరు పెట్టారు. ఈ సేవా కేంద్రం కార్మికులకు విశ్రాంతి స్థలంగానే కాకుండా, రిజిస్ట్రేషన్, రెన్యూవల్, పథకాల సమాచారం, క్లెయిమ్ లకు సహాయం వంటి సేవలను ఒకేచోట అందిస్తుందని వివరించారు. భారత్ లోని కార్మికులు, అసంఘటిత వర్గాల వారికి గౌరవం, భద్రత, సంక్షేమానికి ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారని సీఎం రేఖా గుప్తా గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే ఈ కేంద్రం ఏర్పాటు చేశామని వివరించారు. ఆ తర్వాత అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రధాని బర్త్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించారు.












Click it and Unblock the Notifications
