విశాఖ వాసులకు శుభవార్త.. సెప్టెంబర్ 19న వారికి పండుగే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో పని చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 క్రింద ఇళ్ళ నిర్మాణాలకు సహకారం అందిస్తుంది. అంతేకాదు టిడ్కో గృహాలను కూడా పట్టణ ప్రాంత నిరుపేదలకు అందించే పనిలో ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఇళ్ళ స్థలాల పంపిణీ కూడా చేపడుతోంది.
ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. ఈ విడతలో విశాఖ నగర పరిధిలోని సుమారు 26,426 పేద కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల స్థలాలు అందనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది.

ఈ కార్యక్రమం విశాఖకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించనుంది. త్వరలోనే విజయవాడ నగరంలోనూ మరో 24 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శక పద్ధతిలో ఇళ్ల స్థలాలు దక్కేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న వివిధ సమస్యలను ప్రభుత్వం వేగంగా పరిష్కరిస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 12 వేల ఇళ్ల స్థలాలను విజయవంతంగా క్రమబద్ధీకరించినట్లు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని వేలాది నిరుపేద కుటుంబాలకు మేలు జరుగుతుందని, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జరగనున్న ఈ కార్యక్రమానికి స్థానిక అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెల 19న వారి ఇళ్ళ స్థలాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేయగా పేదలు తమకు ఇళ్ళ స్థలాలు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications
