యూపీఐ ఛార్జీలు పెంచిన వేళ.. నిర్మల సీతారామన్ పన్ను విధానంలో ఓవర్ హాలింగ్
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో నూతన మార్పులు చోటుచేసుకోబోతోన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఎంపిక చేసిన కొన్ని లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది.. అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలులోకి రానుంది. దీనివల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ఎన్పీసీఐ స్పష్టం చెబుతోంది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు సంస్కరణలను తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. పన్ను నిబంధనలలో మార్పుల కోసం వ్యక్తిగత ప్రయోజనాల ఆధారంగా కాకుండా వ్యవస్థకు ఉపయోగపడే రీతిలో విశ్లేషణాత్మక ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించారు.

బెంగళూరులో ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ 8వ అంతర్జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని నిబంధనల వల్ల కొందరు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. అయినప్పటికీ.. ఈ నిబంధనలు పన్ను వ్యవస్థ సమర్థతను దెబ్బతీసేలా ఉంటే వాటిని తొలగించాలనే గళాన్ని వినిపించే వాళ్లు ఇప్పుడు అవసరం అయ్యారని వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు, పన్నుల వసూళ్ల రంగానికి దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే అంశాలపైనే ప్రతి ఒక్కరూ ప్రధానంగా దృష్టి సారించాలని నిర్మల సీతారామన్ చెప్పారు. పన్ను నిబంధనల సవరణలపై ప్రతిపాదనలు చేసేటప్పుడు పూర్తి సమాచారంతో కూడిన నివేదికలను సమర్పించాలని కోరారు. ఏదైనా నిబంధన వల్ల పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం పడుతుంటే, దాని వల్ల ఎంతమంది ప్రభావితమవుతున్నారు, ఎంత సమయం, వ్యయం వృథా అవుతుందనే వివరాలను గణాంకాలతో సహా నిరూపించాలని కోరారు.
దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటో కూడా ప్రతిపాదించాలని, ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఆదాయంపై పడే ప్రభావాన్ని నిశితంగా అంచనా వేయాలని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. వీటి వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, పన్ను పరిధి ఏ మేరకు ప్రభావితమవుతుంది, పన్నుల నిర్వహణపై ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని సమగ్రంగా విశ్లేషించడం ఎంతైనా అవసరమని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాలను సరళీకరిస్తూనే, దేశ ఆర్థిక వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. నిబంధనల మార్పు ఒక వర్గానికి మాత్రమే కాకుండా, మొత్తం ఆర్థిక రంగానికి మేలు చేసేలా ఉన్నప్పుడే నిజమైన సంస్కరణలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. పన్నుల పరిధిని విస్తృతం చేస్తూనే, విధానపరమైన అడ్డంకులను తొలగించడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
