మోడీ కేబినెట్ ప్రక్షాళనకు తాజా ముహుర్తం..! ఆర్ధికమంత్రిగా ఊహించని వ్యక్తి..!
కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు (Modi Cabinet Reshuffle) ప్రధాని మోడీ ఇప్పటికే నిర్ణయించిన పలు ముహుర్తాలు దాటిపోయాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర దినోత్సవం, బీజేపీ సంస్థాగత మార్పులు.. ఇలా పలు డెడ్ లైన్లు మారిపోయాయి. అయినా ఇంకా కేబినెట్ ప్రక్షాళన జరగలేదు. అలా అని ఇప్పట్లో కేబినెట్ ప్రక్షాళన చేసే పరిస్ధితి లేదా అంటే అదీ కాదు. ఢిల్లీలో కాక్రోచ్ ల ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వంలో భారీ ప్రక్షాళన జరగాల్సిందేనని ఆరెస్సెస్ తేల్చిచెప్పేసింది. ఈ నేపథ్యంలో కేబినెట్ ప్రక్షాళనకు ప్రధాని మోడీ తాజాగా మరో రెండు ముహుర్తాల్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో సెప్టెంబర్ 26న 'శ్రాద్ధ' కాలం ప్రారంభానికి ముందే లేదా దసరా (అక్టోబర్ 20) సమయంలో కేబినెట్ ప్రక్షాళన చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముహుర్తంపై అనిశ్చితి ఉన్నప్పటికీ, కేబినెట్లో మార్పులు జరగడం మాత్రం ఖాయమని దక్కన్ క్రానికల్ ఓ కథనంలో తెలిపింది. దీర్ఘకాలిక వ్యూహం కంటే తక్షణ రాజకీయ ఎత్తుగడల పరంగా చూస్తే, ఈ మంత్రివర్గ మార్పులను ప్రధానంగా మూడు అంశాలు నిర్దేశించనున్నట్లు అది చెబుతోంది. ఇందులో ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టేందుకు ఒక కొత్త, ఊహించని వ్యక్తిని తీసుకురావడం, బీజేపీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ప్రాతినిధ్యాన్ని పెంచేలా రాజకీయ వైవిధ్యాన్ని కల్పించడం, అలాగే పలువురు మంత్రులు నిర్వహిస్తున్న అదనపు బాధ్యతల భారాన్ని తగ్గించడం ఉన్నాయి.

కేంద్ర మంత్రివర్గ సభ్యుల పనితీరుపై సమగ్రమైన, 360-డిగ్రీల సమీక్షను చేపట్టాలని ప్రధాన మంత్రి కార్యాలయం తాజాగా నిర్ణయం తీసుకుంది. జెన్ జీ నిరసనల నేపథ్యంలో, పరిస్థితులను మార్చాలనే ఒత్తిడి అధికార పార్టీలోనూ, అలాగే ఆర్ఎస్ఎస్ నుంచీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేబినెట్లో ఉన్న 10 ఖాళీల్లో కొత్తవారిని తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఓ సివిల్ సర్వెంట్ను లేదా టెక్నోక్రాట్ను నియమించవచ్చని అంచనా. వారు కచ్చితంగా రాజకీయాలకు అతీతమైన వారే ఉంటారని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత కేబినెట్ మంత్రుల్లో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ శాఖల్ని నిర్వహిస్తున్నారనే ఆందోళన పెరుగుతోంది. దీంతో వారికి వాటి నుంచి విముక్తి కల్పించడం కేబినెట్ ప్రక్షాళన ఉద్దేశాల్లో ఒకటిగా ఉంది.














Click it and Unblock the Notifications
