Xi Jinping: ప్రాణపాయ స్థితిలో చైనా అధ్యక్షుడు? ఢిల్లీలోనే బ్రెయిన్ స్ట్రోక్?
భారత రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యంపై వెలువడిన ఒక వార్త ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయంలో తీవ్ర కలకలం రేపుతోంది. జిన్పింగ్.. సమ్మిట్ మధ్యలోనే స్పృహతప్పి పడిపోయారని, అనంతరం ఆయనకు తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సంచలనంగా మారింది. ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ, జిన్పింగ్ హఠాత్తుగా కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు షెడ్యూల్ కంటే ముందే ఆయన చైనా బయలుదేరడం ఈ ప్రచారానికి బలం చేకూరినట్లయింది.
వాంజున్ క్సీ పోస్ట్ వైరల్, ఎవరు ఇతను?
ఈ సంచలన వార్తను చైనాలో నిషేధానికి గురైన 'చైనా డెమోక్రసీ పార్టీ' (CDP) అధ్యక్షుడు వాంజున్ క్సీ సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. 1999లో చైనా నుంచి తప్పించుకుని, రష్యా మీదుగా అమెరికా చేరుకుని అక్కడే ఆశ్రయం పొందుతున్న వాంజున్ క్సీకి గతంలోనూ అనేక వివాదాస్పదమైన, కల్పిత కథనాలు ప్రచారంలోకి తెచ్చిన చరిత్ర ఉంది.

ఆయన క్లెయిమ్ ప్రకారం.. జిన్పింగ్ న్యూఢిల్లీలో స్పృహతప్పి పడిపోగానే, సమాచారం బయటకు పొక్కకుండా చూశారని, ఇండియాలో ఆసుపత్రుల్లో చేర్చితే హెల్త్ బులిటెన్ లీక్ అవుతుందనే భయంతో వెంటనే చైనా చేరుకున్న వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా '301 మిలిటరీ హాస్పిటల్'కు హెలికాప్టర్లో తరలించారని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన ప్రాణపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నారంటూ చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
మోడీ విందును జిన్పింగ్ గైర్హాజరు.. అనుమానాలకు ఆజ్యం!
వాంజున్ ఆరోపణల్లో ఎంత నిజముందో పక్కన పెడితే, సమ్మిట్ రోజున జరిగిన కొన్ని పరిణామాలు ఈ అనుమానాలకు ఆజ్యం పోశాయి. ద్వైపాక్షిక చర్చల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతుండగా, జిన్పింగ్ అసౌకర్యంగా కనిపించడంతో మోడీ తన ప్రసంగాన్ని ఆపి "అంతా ఓకేనా?" అని చైనా అనువాదకుడిని విచారించడం కెమెరాలకు చిక్కింది.
అంతేకాకుండా, భారత్ మండపంలో ప్రధాని మోడీ ఇచ్చిన గ్రాండ్ గాలా డిన్నర్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అందరూ హాజరవగా, జిన్పింగ్ మాత్రం విందును స్కిప్ చేసి నేరుగా హోటల్ గదికి విశ్రాంతి కోసం వెళ్లిపోయారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆ విందులో ప్రాతినిధ్యం వహించారు. ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చిన ఒక అగ్రదేశ నేత, ఎంతో ప్రతిష్టాత్మకమైన విందును హఠాత్తుగా దాటవేయడం వెనుక అనారోగ్య కారణాలే ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది.
చైనా మీడియా క్లారిటీ.. సామాజిక మాధ్యమాల్లో ఫ్యాక్ట్ చెక్!
ఈ వైఖరిపై చైనా అధికారిక మీడియా భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. సమ్మిట్ ముగిసిన వెంటనే జిన్పింగ్ తన ఇతర ఉన్నతాధికారుల బృందంతో కలిసి ఒకే ప్రత్యేక విమానంలో బీజింగ్కు సురక్షితంగా చేరుకున్నారని 'gov.cn' స్పష్టం చేసింది. సీడీపీ నేత వాంజున్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేవని, అవి వాస్తవ దూరమని ఎక్స్ సంస్థ కూడా ఆయన పోస్టుకు ఫ్యాక్ట్ చెక్ జోడించింది. గతంలోనూ బీజింగ్ తిరిగొచ్చినప్పుడు జిన్పింగ్కు ఎలాంటి గ్రాండ్ వెల్కమ్ లభించే ఆనవాయితీ లేదని, సాధారణ ప్రక్రియలోనే ఆయన వెళ్లారని పేర్కొంది.
అసలేంటీ 'చైనా డెమోక్రసీ పార్టీ'?
1998లో చైనాలోని కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించాలనే లక్ష్యంతో టియాన్మాన్ స్క్వేర్ నిరసనకారులు ఈ 'చైనా డెమోక్రసీ పార్టీ'ని ప్రారంభించారు. అయితే నాటి చైనా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఈ పార్టీపై నిషేధం విధించి, సీనియర్ నేతలను జైలుకు పంపింది. దాంతో ఈ పార్టీ ప్రతినిధులు అమెరికా, బ్రిటన్లలో ఆశ్రయం పొందుతూ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తుంటారు. అయితే వాంజున్ క్సీ గతంలోనూ అనేక అబద్ధపు వార్తలను వ్యాప్తి చేసిన నేపథ్యం ఉండటంతో, ప్రస్తుతం జిన్పింగ్ ఆరోగ్యంపై వచ్చిన వార్త సైతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను, సస్పెన్స్ను రేకెత్తిస్తోంది.















Click it and Unblock the Notifications
