El Nino లోడ్ పెరిగింది, విద్యుత్ డిమాండ్ ఆల్టైమ్ హై! 15 రోజులకే నిల్వలు
ఆంధ్రప్రదేశ్పై 'ఎల్ నినో' (El Nino) ప్రభావం తీవ్రంగా పడింది. వానాకాలంలోనూ ఎండలు వేసవి కాలాన్ని తలపిస్తుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. సెప్టెంబర్ నెలలో సాధారణంగా ఉండాల్సిన డిమాండ్ కంటే రోజుకు అదనంగా 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 20 శాతం మేర వినియోగం పెరగడం విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హైడల్ పవర్ జీరో.. పూర్తిస్థాయిలో థర్మల్ జనరేషన్!
రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో జలవిద్యుత్ ఉత్పత్తి పూర్తిగా జీరో అయిందని మంత్రి స్పష్టం చేశారు. దీంతో గ్రిడ్ను సమతుల్యం చేసేందుకు విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ ప్రస్తుతం పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి రోజువారీ విద్యుత్ డిమాండ్ 240 మిలియన్ యూనిట్లుగా ఉంటే, ఈసారి అది ఏకంగా 290 మిలియన్ యూనిట్లకు పెరిగిందని విశ్లేషించారు. బొగ్గు కొరత రాకుండా ముందస్తుగా థర్మల్ పవర్ స్టేషన్లలో 15 రోజులకు సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచామని, అక్కడక్కడా తలెత్తుతున్న చిన్నపాటి సాంకేతిక సమస్యలను వెంటనే అధిగమిస్తున్నామని వివరించారు.

ప్రజలకు, రైతులకు అవాంతరాలు లేని విద్యుత్
ఎంతటి డిమాండ్ వచ్చినా సరే.. ప్రజలకు, వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు ఎలాంటి కోతలు లేకుండా 24 గంటల పాటు నిరంతర విద్యుత్ను అందజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గొట్టిపాటి తెలిపారు. అందుకోసమే కొరత ఏర్పడినప్పుడల్లా ఓపెన్ మార్కెట్ నుంచి అధిక ధరలకైనా విద్యుత్ను కొనుగోలు చేసి సరఫరా నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావం దేశంలోని అన్ని రాష్ట్రంపైనా ఉందని, అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో సరఫరా పరిస్థితి చాలా మెరుగ్గా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
భవిష్యత్ అవసరాల కోసం బ్యాటరీ స్టోరేజ్.. 5,500 మెగావాట్ల లక్ష్యం!
రాబోయే రోజుల్లో విద్యుత్ అవసరాలను ముందస్తుగా అంచనా వేస్తూ డిస్కంల సామర్థ్యాన్ని పెంచుతున్నామని మంత్రి వెల్లడించారు. పగటిపూట అందుబాటులో ఉండే సోలార్ విద్యుత్ను భారీ సామర్థ్యం ఉన్న బ్యాటరీలలో స్టోర్ చేసుకొని, రాత్రివేళల్లో వచ్చే 'పీక్ అవర్స్' డిమాండ్ సమయాల్లో వినియోగించుకునేలా నూతన సాంకేతికతపై దృష్టి సారించామని వివరించారు. రాబోయే కాలంలో అదనంగా 5,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేస్తోందని పునరుద్ఘాటించారు.














Click it and Unblock the Notifications
