1901 తర్వాత అత్యంత వేడి నెల.. దేశంలో కరెంట్ వాడకం ఆల్ టైమ్ హై!
ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.
వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.

గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!
కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బొగ్గు కొరతతో 51 థర్మల్ ప్లాంట్లకు కష్టాలు!
విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో థర్మల్ ప్లాంట్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పాదన చేయడానికి అవసరమైన బొగ్గు నిల్వలు ప్లాంట్లలో కరిగిపోతున్నాయి. ఆగస్టు చివరి నాటికి దేశంలోని ఏకంగా 51 థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్లాంట్ల వద్ద ఉన్న బొగ్గు కేవలం 9 రోజులకు మాత్రమే సరిపోతుందని, నిబంధనల ప్రకారం ఉండాల్సిన నిల్వల్లో ఇది 47.8 శాతం మాత్రమేనని తెలుస్తోంది.
గ్రిడ్ ఆపరేటర్లకు సవాలుగా మారిన 'సాయంత్రం' సమయం!
పగటిపూట సోలార్ (సౌర) విద్యుత్ అందుబాటులో ఉండటంతో డిమాండ్ను తట్టుకోగలుగుతున్నప్పటికీ, సూర్యుడు అస్తమించే సాయంత్రం సమయంలో గ్రిడ్ల నిర్వహణ అధికారులకు పెద్ద పరీక్షగా మారుతోంది. సాయంత్రం వేళల్లో సోలార్ పవర్ నిలిచిపోవడం, అదే సమయంలో గృహాల నుంచి ఏసీలు, కూలర్ల వాడకం గరిష్ట స్థాయికి చేరడంతో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే విద్యుత్ కొరత ఏర్పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం కేంద్రానికి పెద్ద సవాలుగా మారనుంది.














Click it and Unblock the Notifications