El Nino: సెప్టెంబర్ మూడో వారం నుంచి కరువు?
వర్షాకాలం చివరికి వస్తున్న కొద్దీ దేశంలోని రైతన్నల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన తాజా అంచనాల ప్రకారం.. సెప్టెంబర్ మూడో వారం నుంచి దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న 'ఎల్ నినో' ప్రభావం రబీ పంటల సాగుపై తీవ్ర ముప్పుగా పరిణమించేలా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్ వంటి పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే 27 నుంచి 45 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ముగిసే సమయానికి వర్షాలు మొహం చాటేస్తే.. వచ్చే శీతాకాలంలో వేసే రబీ పంటల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
సాధారణంగా రబీ సీజన్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్లో వర్షాలు పడకపోయినా విత్తనాలు వేసే సమయం మారకపోవచ్చు కానీ, నేలలో తేమ శాతం దారుణంగా పడిపోతుంది. ప్రస్తుతం దేశంలోని 178 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం తగ్గిపోయాయి.

గతేడాది ఇదే సమయానికి 163.44 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉండగా, ఇప్పుడు అది 130.55 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పరిమితమైంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ , మధ్యప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో నీటి నిల్వలు లేకపోతే విత్తనాలు మొలకెత్తడమే కష్టమవుతుంది.
వరి, గోధుమలు, శనగ పంటలపై తీవ్ర ప్రభావం
భారతీయ వ్యవసాయంలో రబీ కాలం చాలా కీలకమైనది. ముఖ్యంగా నీటి లభ్యత , నేలలోని తేమపై ఆధారపడే గోధుమ, ఆవాలు, శనగ పంటలు ఈసారి తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి.
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో గోధుమలు, ఆవాల సాగు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మొదటి తడికి రిజర్వాయర్ నీళ్లే ఆధారం. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని నల్లరేగడి నేలల్లో వేసే శనగ పంట కేవలం భూమిలోని తేమ ఆధారంగానే పెరుగుతుంది. వర్షాలు లేక భూమి ఎండిపోతే ఈ పంటల దిగుబడి దారుణంగా పడిపోతుంది.
'ఇండియన్ ఓషన్ డైపోల్' ఆదుకుంటుందా?
ఎల్ నినో వల్ల ఏర్పడే కరవు పరిస్థితులను అధిగమించడానికి 'ఇండియన్ ఓషన్ డైపోల్' (IOD) కాస్త ఆశాకిరణంగా కనిపిస్తోందని నిపుణులు చెప్తున్నారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఈ సానుకూల మార్పు వల్ల భారత్ వైపు వర్షపు మేఘాలు తొలకరిచ్చే అవకాశం ఉంది. 1997, 2023 సంవత్సరాల్లో ఎల్ నినో తీవ్రతను ఈ ఐఓడీ కొంతవరకు తగ్గించగలిగింది. అయితే, ఇది ప్రధానంగా వర్షాకాలానికే పరిమితమవుతుంది కాబట్టి, ఎండిపోయిన భూగర్భ జలాలను, ఖాళీ అయిన రిజర్వాయర్లను ఎంతవరకు నింపుతుందనేది అనుమానంగానే ఉంది.
ధరల మంట తప్పదా?
ఒకవేళ అక్టోబర్, నవంబర్ నెలల్లో భూమిలో తేమ శాతం పెరగకపోతే రబీ పంటల విస్తీర్ణం తగ్గడమే కాకుండా దిగుబడులు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో గోధుమలు, పప్పుధాన్యాలు, వంటనూనెల సరఫరా తగ్గి, నిత్యావసర ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం రైతుల ఆదాయాన్నే కాకుండా, సామాన్య ప్రజల జేబులకు కూడా పెద్ద కన్నం వేసేలా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications
