వినాయక మండపాలకు అదిరిపోయే ఆఫర్.. అలా నిమజ్జనం చేస్తే రూ.10,116 నగదు పురస్కారం!
వినాయక నవరాత్రులను సంస్కృతి, సంప్రదాయాలతో జరుపుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల వేడుకలు ఇదెక్కడి భక్తి అన్నట్టు తయారయ్యాయి. మద్యం, డీజే డ్యాన్స్ లు, భక్తి పాటలు కాకుండా, అశ్లీల నృత్యాలతో వినాయక నవరాత్రుల ఉద్దేశమే మారిపోతుంది. ఈ పరిస్థితిని మార్చేందుకు సూర్యాపేటలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ నేత వల్లాస్ జానీ స్థానిక గణేష్ మండపాలకు ప్రత్యేక ప్రోత్సాహకం ప్రకటించారు.
సూర్యాపేటలోని రాజీవ్ నగర్లో ఏర్పాటైన వినాయక మండపాల్లో మద్యం సేవించకుండా, నిష్ఠతో పూజలు నిర్వహించి, భక్తిభావంతో వేడుకలు జరిపి, క్రమశిక్షణతో నిమజ్జనం పూర్తి చేసిన మండపాలకు రూ.10,116 నగదు పురస్కారం అందిస్తామని ఆయన ప్రకటించారు. భక్తి భావం ఉట్టిపడేలా "మద్యం వద్దు.. మహాగణపతి భక్తి ముద్దు" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వల్లాస్ జానీ దీనిపై మాట్లాడుతూ భక్తి అనేది ప్రదర్శన కాదని, అది ప్రతీ ఒక్కరిలో లోపలి క్రమశిక్షణ అని స్పష్టం చేశారు. పండుగల పేరుతో మద్యం సేవించడం, శబ్ద కాలుష్యం సృష్టించడం, అనవసరపు అశ్లీల నృత్యాలు చేయటం యువతను తప్పుదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. ఈ బహుమతి కేవలం డబ్బు ఇవ్వడం కోసం కాదని, యువతలో బాధ్యతా భావం, సంప్రదాయాల పట్ల గౌరవం పెంచే సామాజిక సంస్కరణగా భావిస్తున్నానని చెప్పారు.
అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని, పర్యావరణాన్ని కాపాడుతూ సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనం చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. మన ఊరు, మన కుటుంబం అనే భావనతో బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ ఆలోచన కేవలం సూర్యాపేటకే పరిమితం కాకుండా ఇతర గ్రామాలు, పట్టణాల్లోని ఉత్సవ కమిటీలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ తరహా ప్రోత్సాహకాలను ప్రకటిస్తే కాస్త పరిస్థితి మారుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక భావనతో జరగాలనేది చాలా మంది కోరిక. అయితే ఈ తరహా ప్రోత్సాహకాలు అలా సాంప్రదాయాలను, భక్తి భావాన్ని మళ్ళీ భక్తులలో కలిగిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications
