"డోంట్ కేర్..! మా లెక్కలు మాకున్నాయ్..!" ట్రంప్ కు తేల్చేసిన మోడీ..!
రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అధికారం కల్పించేలా అక్కడి చట్ట సభలు ఆమోదించిన బిల్లుపై కేంద్రం (India) స్పందించింది. రష్యా చమురుపై విధిస్తున్న ఆంక్షల కారణంగా భారత్ కు ఇబ్బందులు తప్పవన్న అంచనాల నేపథ్యంలో విదేశాంగశాఖ దీనిపై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో తాజా పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. అదే సమయంలో తమ 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతకు భారత్ ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తుందని తేల్చిచెప్పింది.
గతంలో పలు సందర్భాల్లో చెప్పినట్లుగా ఇంధన భద్రతను నిర్ధారించడానికి భారతదేశం దృఢంగా కట్టుబడి ఉందని, వైవిధ్యభరితమైన వనరుల సేకరణ ద్వారా, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని కొనసాగిస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని నెలలుగా ఈ అంశంపై పలువురు అమెరికా ప్రతినిధులతో ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయని, ఇలాంటి చర్యల వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్పై కూడా పడగల ప్రభావాలను భారత్ స్పష్టంగా తెలియజేసిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా పరిణామాల వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి భారతీయ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి ప్రభుత్వం సన్నిహితంగా పనిచేస్తుందని పేర్కొంది.

మరోవైపు రష్యా, ఇరాన్ వంటి దేశాలు భారత్, చైనాకు చమురు అమ్ముతూ తమ ఆర్దిక వ్యవస్థల్ని బలోపేతం చేసుకుంటున్నాయని, దీని వల్ల ఉక్రెయిన్ యుద్దంతో పాటు ఇరాన్ వార్ లోనూ తమకు ఇబ్బందులు తప్పడం లేదని అమెరికా భావిస్తోంది. అందుకే వీటికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా అమెరికా చట్ట సభల్లో ట్రంప్ సర్కార్ తెచ్చిన బిల్లులకు మంచి మెజార్టీతో అక్కడి రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కూడా మద్దతిచ్చారు. దీంతో త్వరలోనే ఈ బిల్లు చట్ట రూపం దాల్చడం, భారత్, చైనా వంటి దేశాలపై మరోసారి ట్రంప్ సుంకాల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే భారత్ ఈ పరిణామాలను లెక్క చేయదని తేలిపోయింది.













Click it and Unblock the Notifications
