ఇనుపరాడ్డుతో కొట్టి యాసిడ్ పోసి ప్రియుడిని హతమార్చి ఆపై....
ఇటీవల కాలంలో విపరీతమైన ప్రేమ ధోరణులు, ఆపై ఊహించని విధంగా మర్డర్ లు పెరిగిపోయాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ఎవరిని చంపుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో అలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న జంట మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, ఒకరి ప్రాణాలు తీసుకునే స్థాయికి విషయం చేరుకుంది.
గరివిడి మండలం కందిపేటకు చెందిన దనాల రాములమ్మ అనే మహిళ తన భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె బావ కుమారుడైన శ్రీనుతో సన్నిహిత సంబంధం పెంచుకుంది. శ్రీను కూడా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇద్దరూ కొంతకాలంగా కలిసి సహజీవనం చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున వారి మధ్య తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. వాగ్వాదం హద్దులు దాటి హింసాత్మక రూపం తీసుకుంది.

ఆ సమయంలో రాములమ్మ ఇనుప రాడ్డుతో శ్రీను తలపై బలంగా కొట్టింది. అనంతరం అతని మీద యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలతో శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత రాములమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది.. ఆమెను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.ఈ విషయం తెలిసి చీపురుపల్లి స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. స్థానికులు ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇద్దరూ వివాహితులై ఉండి కూడా సహజీవనం చేశారు. ఒకవేళ మనస్పర్ధలు వస్తే వాటిని అధిగమించాలి కానీ అలా కాకుండా ఇలాంటి దారుణానికి మహిళ ఒడిగట్టటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.. జిల్లాలో ఇటువంటి కుటుంబ వివాదాలు, సంబంధాల సమస్యలు తరచుగా తీవ్ర రూపం తీసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు ఇప్పటికే సాక్షుల విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యాయత్నం చేసిన రాములమ్మ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది, అసలు హత్యకు దారి తీసేలా ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
