TIDCO ఇళ్ల రుణాలపై చంద్రబాబు సీరియస్. బ్యాంకులకు వార్నింగ్
రాష్ట్రంలోని అన్ని రంగాలను, అన్ని వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని, ప్రతి అర్హుడికి బ్యాంకింగ్ సేవలు చేరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో బుధవారం జరిగిన 236వ ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. కొన్ని బ్యాంకులు రుణాలు ఇచ్చే విషయంలో చాలా వెనకబడి ఉన్నాయని, లక్ష్యాలను చేరుకుంటేనే ఎస్ఎల్బీసీ సమావేశానికి అర్థం ఉంటుందని సీఎం అన్నారు.
వ్యవసాయ రుణాలు సహా వివిధ వర్గాలకు బ్యాంకులు అందించే సేవలపై సీఎం సమీక్షించారు. గత ఎస్ఎల్బీసీ సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై ఏ మేరకు చర్యలు తీసుకున్నారని బ్యాంకర్లను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 13 అంశాలకు గానూ 9 అంశాలపై చర్యలు తీసుకున్నామని బ్యాంకర్లు తెలిపారు. గత ఎస్ఎల్బీసీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను, లక్ష్యాలను ఇంకా చేరుకోకపోవడం సరికాదని సీఎం అన్నారు. ఎంఎస్ఎంఈలకు రుణాల మొత్తం గతం కన్నా ఈసారి పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో రుణాల మంజూరు జరగలేదన్నారు.

కౌలు రైతులకు రుణాలపై దృష్టి పెట్టండి
సమీక్షలో సీఎం మాట్లాడుతూ... 'పీఎం సూర్యఘర్లో దేశంలోనే ముందు స్థానంలో రాష్ట్రాన్ని నిలపాలని భావిస్తున్నాం... బ్యాంకులు పెద్దఎత్తున రుణాలు ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. రాష్ట్ర ఆర్ధిక వృద్ధి 15 శాతం సాధించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఎల్నినో కారణంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది... ప్రతికూలతలు అధిగమించేందుకు కృషి చేస్తున్నాం. కౌలు రైతులకు రుణాలు సమృద్ధిగా అందించేలా బ్యాంకులు ముందుకు రావాలి. రుణాల చెల్లింపుల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచారు. రుణాలు తీసుకున్న వారిలో 99 శాతానికి పైగా మహిళలు రుణాలను సమయానికే చెల్లించేస్తున్నారు... కేవలం 0.67 శాతం మంది మహిళలు మాత్రమే రుణాల చెల్లింపుల్లో వెనకబడ్డారు. వీరి నుంచి రుణాల 100 శాతం రికవరీ సాధించేందుకు వన్ టైమ్ సెటిల్మెంట్ విధానం గురించి బ్యాంకులు ఆలోచన చేయాలి. అలాగే, టిడ్కో గృహాలకు రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ త్వరితగతిన అమలులోకి తీసుకురావాలి...సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం. డీజీపీ సైబర్ సెక్యూరిటీ సెల్తో సమన్వయం జరగాలి. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ ఫ్రాడ్-ఫైనాన్షియల్ లిటరసీ అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. నాలా చట్టం రద్దు చేసినందున... నాలా పేరుతో రుణాలు ఇవ్వకుండా ఎవరినీ ఇబ్బందులకు గురిచేయవద్దు.' అని చెప్పారు.
236వ ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్లో బ్యాంకింగ్లో రుణాల వేగం పెరిగింది. 2026 జూన్ నాటికి రూ.10.28 లక్షల కోట్లకు మొత్తం అడ్వాన్సులు చేరాయి. వ్యవసాయ రంగానికి భారీగా రుణ మద్దతు లభించింది. జూన్ 2026 నాటికి వ్యవసాయ రుణాలు రూ.3.98 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గతేడాది కన్నా ఎక్కువ.
- ఎంఎస్ఎంఈలకు సంబంధించి 2026-27 ఆర్ధిక సంవత్సరం జూన్ వరకు తొలి త్రైమాసికంలో 2.33 లక్షల ఎంఎస్ఎంఈలకు రూ.63,686 కోట్ల రుణాల పంపిణీ జరిగింది.
- అటు పీఎం సూర్య ఘర్కు సెప్టెంబర్ 10 నాటికి 1,57,703 దరఖాస్తులు రాగా రూ.3,081 కోట్ల రుణాల మంజూరు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలపై అన్ని బ్యాంకుల్లో సర్వీస్ ఛార్జీల నుంచి పూర్తి స్థాయి మినహాయింపు ఇచ్చాయి.
- ఎస్హెచ్జీలకు సెప్టెంబర్ 10 నాటికి మొత్తం రూ.18,621 కోట్ల రుణాల పంపిణీ జరిగింది.
- పీఎం ముద్ర రుణాల్లో భారీ పురోగతి కనిపించింది. సెప్టెంబర్ 10 నాటికి 4,48,562 దరఖాస్తులకు రూ.13,757 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి.
మరోవైపు సమీక్షలో రాజధాని అమరావతి ఫైనాన్సియల్ హబ్లో పలు బ్యాంక్ కార్యాలయాల నిర్మాణాల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరింత వేగంగా నిర్మాణాలు పూర్తిచేయడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. అలాగే ఇకపై ఎస్ఎల్బీసీ సమావేశాలను...బ్యాంకులు, జిల్లాలు, విభాగాల వారీగా ఫలితాలు విశ్లేషించిన తర్వాతే దానిపై సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, బ్యాంకింగ్ ఉన్నతాధికారులు













Click it and Unblock the Notifications
