గణేష్ నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గణేష్ నిమజ్జనంలో అప్పటి వరకూ ఉత్సాహం ఆడి పాడిన విద్యార్థులు విగతజీవులుగా మారారు. స్థానికంగా ఉన్న నేరేడు చెరువులో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వినాయకుడి నిమజ్జనాలు స్టార్ట్ అయిన మూడో రోజే అది కూడా ఒకేసారి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన విద్యార్థుల వివరాలు చూస్తే నరసింహ రాజు(బీటెక్), సుమంత్ (డిప్లొమా సెకండియర్) గణేష్ (డిప్లొమా సెకండియర్) ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్) శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్టియర్) అలాగే సిద్ధార్థ్ (10వ తరగతి) ఉన్నారు. వీళ్లంతా శిరీష ఛారిటబుల్ ట్రస్ట్ కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
ఇక ఈ దుర్ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారిక ఖాతాలో పోస్టు చేశారు. "సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, పెద్దకంజర్ల గ్రామంలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు" అని ట్వీట్ పోస్టు చేశారు.

అలాగే ఈ ఘోర ఘటనపై రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గణేశ్ నిమజ్జనాల సమయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ సూచించారు. ఇక విద్యార్థులు మృతి చెందిన ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారులకు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని తెలిపారు.












Click it and Unblock the Notifications
