భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. 4,100 కోట్లకు పైగా నష్టం
భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ముష్కరులు జరిపిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలిన నేపథ్యంలో మే 7 నుంచి 10 మధ్య పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను ఏరిపారేసింది. అలాగే పాకిస్థాన్ పై వాణిజ్య పరంగానూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు నదీ జలాల పంపిణీని నిలిపివేసింది. అయితే భారత్ పైనా పాకిస్థాన్ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
అందులో ప్రధానమైనది పాకిస్థాన్ గగనతలం మూసివేత.. భారత్ విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా మనదేశంలోని విమానయాన సంస్థలకు భారీగానే నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ఏడాదిపైగా ఈ నిషేధం కొనసాగుతుండగా తాజాగా ఆ గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీస్ టూ ఎయిర్ మెన్(NOTAM) సెప్టెంబర్ 24 వ తేదీకి ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆ గడువును అక్టోబర్ 24 కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజా నోటమ్ ను పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ జారీ చేసింది.

"భారత్ లో రిజిస్టర్ అయిన ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్స్ ను నిర్వహించే సంస్థలు, లీజ్ కు తీసుకున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ , మిలిటరీ ఫ్లైట్స్ కు పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ అందుబాటులో లేదు" అని పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ తాజాగా జారీ చేసిన నోటీస్ టూ ఎయిర్ మెన్(NOTAM) లో ఉందని పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రిక వెల్లడించింది. నోటమ్ ప్రకారం సెప్టెంబర్ 26 బుధవారం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి నూతన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 24 వరకు ఈ నిబంధన అమల్లో ఉండనుంది. ఆ తర్వాత కూడా భారత్ విమానాలపై పాకిస్థాన్ గగనతలం మరోసారి మూసివేస్తూ గడువు పెంచే అవకాశం ఉంది. ఇలా ఇంకెన్ని రోజులు కొనసాగుతుందన్న దానిపై స్పష్టత లేదు. ఇక భారత్ విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా ఇప్పటివరకూ భారత్ కు దాదాపు 500 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 4,100 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
