"అఫిడవిట్ లో చెప్పిన దాని కన్నా గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తా"
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూముల గురించి చేసిన ప్రకటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. తాను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూముల కన్నా గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని తేల్చిచెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో 22ఏ పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టుగా ప్రస్తావించిన అంశంపై ఎక్స్ వేదికగా కవిత స్పందించారు. అసెంబ్లీలో ఈరోజు సీఎం ఎవరెవరి పేర్లు ప్రస్తావించి వారికి ఎక్కువ భూములు ఉన్నట్టుగా చెప్పారో వారందరిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
సీఎం అసెంబ్లీలో ఎవరెవరికి అక్రమ భూములు ఉన్నట్టు చెప్పారో వారందరిపై సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. అసెంబ్లీలో ఈరోజు సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. "సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి" అని డిమాండ్ చేశారు.

తాను ఎప్పటి నుంచో చెప్తున్నట్టుగా గుంపు మేస్త్రీ- గుంటనక్క కలిసే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. వారిద్దరూ కలిసే ఈ డ్రామాలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించి తనకు గజం భూమి ఎక్కువగా ఉన్నా.. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న భూమి కన్నా గజం అదనంగా ఉన్నట్టు తేలినా ఆ భూములు ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానని కుండ బద్దలు కొట్టారు.












Click it and Unblock the Notifications
