నాగార్జున మేనకోడలికి కేంద్రం కీలక పదవి: ప్రీతి జింతాకూ చోటు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. నూతనంగా 18 మంది సభ్యులను ఈ బోర్డులో నియమించింది. ప్రముఖ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టెక్నీషియన్లు.. ఇందులో ఉన్నారు. ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి.. ఇందులో ఉన్నారు. బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి ఈ నూతన బోర్డు మూడేళ్ల పాటు కొనసాగుతుంది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కూడా ఈ నూతన బోర్డులో స్థానం లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 3 (1) సర్టిఫికేషన్ రూల్స్, 2024 లోని రూల్ 3 క్లాజ్ ఆధారంగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అ ప్యానెల్ తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. 2017లో 12 మంది సభ్యులతో బోర్డును చివరగా నియమించగా అప్పటి సభ్యుల పదవీకాలం ముగిసినందున ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉంది.

ఈ నూతన బోర్డులో జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్, ప్రముఖ నటుడు మనోజ్ జోషి, బెంగాలీ స్టార్ నటుడు ప్రసేన్జిత్ ఛటర్జీ, నటి పల్లవి జోషి, టెలివిజన్ నటి రూపాలీ గంగూలీలకు చోటు కల్పించారు. వీరితో పాటు వినోద్ అనుపమ్, అభిషేక్ జైన్, హన్స్రాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, నీలా మాధబ్ పాండా, నిషిగంధ వాడ్, వామన్ కేంద్రే, రమేష్ పతంగే వంటి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో ఉన్నారు.
సుప్రియ యార్లగడ్డ.. గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. 1996లో పవన్ కళ్యాణ్తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత నిర్మాతగా మారారు. అన్నపూర్ణ స్టూడియోస్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తోన్నారు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా తెలుగు సినీరంగంలో సుపరిచితురాలు. 2018లో అడవి శేష్ నటించిన గూఢచారిలో నటించారు. ఇప్పుడు దాని సీక్వెల్ జీ 2లో నటిస్తోన్నారు.












Click it and Unblock the Notifications
