తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అదనంగా 5లక్షల ఇళ్ళు!
తెలుగు రాష్ట్రాల్లో ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త. సొంతిల్లు కట్టుకోవాలని నిరీక్షిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఇళ్ళ కేటాయింపుపై శుభవార్త చెప్పింది.
ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలకు కలిపి ఏకంగా 5 లక్షల ఇళ్ళను కేటాయిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది వినాయక నవరాత్రి వేడుకలు జరుగుతున్న వేళ ఏపీ, తెలంగాణా ప్రజలకు తీపి కబురు. ఇప్పటికే ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలలో గృహ నిర్మాణ పథకాలు అమలవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పథకాలు మరింత బలోపేతం కావడమే కాకుండా, ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరిగేందుకు మార్గం సుగమమైంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా ఈ ఇళ్లను మంజూరు చేసింది. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం 2 కోట్ల ఇళ్లను కేటాయించింది.
అందులో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, జలశక్తి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యేకంగా 'ఆవాస్ ప్లస్' (Awaas+) మొబైల్ యాప్ను దీనికోసం వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు.

ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా గుర్తించి, పథకం ఫలాలను నేరుగా అందించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నిరుపేదలకు గూడును ఏర్పరిచే ఈ ఇళ్ళ నిర్మాణాలను కూడా రాబోయే 2 నుండి మూడేళ్ళ వ్యవధిలోనే వేగవంతంగా పూర్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రాథమికంగా ఆర్థిక సహాయంగా రూ.1.20 లక్షలు, అదనపు సహాయంగా రూ.1.80 లక్షల వరకు అందజేస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అలాగే మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రత్యేకంగా రూ.12 వేల ఆర్థిక సాయం ఇస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ బృహత్తర నిర్ణయంతో సొంతింటి కల నెరవేర్చుకోవాలని నిరీక్షిస్తున్న వారికి మేలు జరుగుతుంది.














Click it and Unblock the Notifications
