వైసీపీలోకి మాజీ మంత్రి రీ ఎంట్రీ - జగన్ కొత్త స్కెచ్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కూటమి- వైసీసీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. కాగా, ఉత్తరాంధ్ర వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన కార్యాచరణ పై దిశా నిర్దేశం చేసారు. ఇదే సమయంలో పార్టీకి దూరమైన మాజీ మంత్రి రీ ఎంట్రీ పైనా మంత్రాంగం సాగుతోంది. దీంతో, కీలక నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్ర పై ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఇక, మజ్జి శ్రీను పార్టీ వీడటంతో ఆయన బాధ్యతలు నిర్వహించిన భీమిలి పైన జగన్ నేతలతో చర్చలు చేసారు. గ్రేటర్ విశాఖతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో తక్షణం సమన్వయకర్తను నియమించాలని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భీమిలి సమన్వయకర్తగా పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ పేరు ప్రకటించాలని కేంద్ర కార్యాలయంలోని ముఖ్య నేతలను నాలుగు రోజుల కిందట జగన్ ఆదేశించారు. అయితే, పార్టీ ముఖ్య నేతలు ఇచ్చిన నివేదికతో పరిస్థితితో మారిపోయింది. విజయనగరం వరకు మాత్రమే మార్పులు.. బాధ్యతల పైన ప్రకటన చేసారు. భీమిలి నియోజకవర్గంలో సీనియర్.. ఆర్దికంగా బలం ఉన్న నేత అవసరమని జగన్ భావిస్తున్నారు.

భీమిలి పై జగన్ కీలక మంత్రాంగం
దీంతో.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తో పార్టీ నేతలు టచ్ లోకి వెళ్లారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యే గా పని చేసిన అవంతి.. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ పని చేసారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం సాగింది. అయితే... మారుతున్న పరిస్థితుల్లో అవంతి తిరిగి వైసీపీలోకి వచ్చే విధంగా సీనియర్లు చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముత్తంశెట్టితో ఈ విషయమై చర్చించి ఆయన సుముఖంగా ఉంటే తాడేపల్లి తీసుకురావాలని నేతలకు సూచించినట్లు సమాచారం. ఒకవేళ ముత్తంశెట్టి ముందుకురాకుంటే మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో త్రిసభ్య సమన్వయ కమిటీని నియమించే ఆలోచన చేస్తున్నారు. అయితే.. అవంతి తిరిగి వైసీపీలోకి వస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ రోజు లేదా రేపు అవంతి వ్యవహారం లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications
