మోదీ 25ఏళ్ల ప్రజాప్రస్థానం.. ఆశీర్వాద దీపం.. అక్టోబర్ 17వరకు బీజేపీ బిగ్ ప్లాన్!
గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకు వెళ్లేందుకు బిగ్ ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ''సేవా సంకల్ప్ అభియాన్ - జన్ సేవా హీ ప్రభు సేవా" పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 'ఆశీర్వాద దీపం'
అందులో భాగంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు దేశవ్యాప్తంగా 'ఆశీర్వాద దీపం' పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు పాఠశాలల్లో చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు
సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అట్లాగే "సేవ-అంకితభావం-25 సంవత్సరాలు", "వికసిత భారతదేశం" అనే అంశాలపై సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రధాని మోదీజీ 25 ఏళ్ల ప్రజాసేవను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామాల్లో వివిధ రూపాల్లో కళా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.
మోదీ పాలన పై రీల్స్, వీడియోలు
''ఆంగన్ మిలన్ సేవ'' పేరుతో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను ఘనంగా సన్మానిస్తామని పేర్కొన్నారు. మోదీ పాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై లబ్ధిదారుల అభిప్రాయాలను రీల్స్, వీడియోలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు.
సేవా జ్యోతి కలశయాత్ర పేరుతో గ్రామాల్లో యాత్రలు
'సేవా జ్యోతి కలశ యాత్ర - వికసిత భారతదేశ సంకల్పం'' పేరుతో మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు క్రుతజ్ఝతలు తెలియజేస్తూ అక్టోబర్ 7న గ్రామాలు, ప్రాంతాల్లో యాత్రలు నిర్వహిస్తామన్నారు. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణం కోసం ప్రజలను ఏకం చేయాలని, వడ్నాగర్ నుండివారణాసి, వారణాసి నుండి వడ్నాగర్ పేరిట పవిత్ర నదుల జలంతో వడ్నాగర్ లోని హటకేశ్వర్ మహాదేవ్ ఆలయంలో, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో జలాభిషేకం చేస్తామన్నారు.
సేవా సేతు అభియాన్ పేరుతో అక్టోబర్ 17 వరకు ప్రత్యేక శిబిరాలు
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ''సేవా సేతు అభియాన్'' పేరుతో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు అసెంబ్లీ, మండలస్థాయిలో ప్రత్యేకశిబిరాలు నిర్వహించి కేంద్ర సంక్షేమపథకాల ప్రయోజనాలను, ప్రజలకు ఒకేచోట నేరుగా అందించేలా చేయాలి.దీంతోపాటు ప్రజా సంక్షేమపథకాలు, జాతీయ చిహ్నాలు, అభివృద్ధి చెందిన భారతదేశ సందేశాన్ని రంగోలిరూపంలో ప్రదర్శించాలి.
సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్
సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరిట యువ ఆవిష్కర్తలను ఒకేచోట చేర్చి కొత్త ఆలోచనలకు, పరిష్కార మార్గాలను కనుగొనేలా కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. సుపరిపాలన- సేవా సంవాద్ పేరుతో ప్రధాన నగరాల్లో అక్టోబర్ లో సర్పంచులను, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులతో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ విస్తృత కార్యక్రమాల్లో ప్రజలు, కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులు, ప్రజా ప్రతినిధులు పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.













Click it and Unblock the Notifications
