ఏపీలో కోచింగ్ సెంటర్లకు సర్కార్ షాక్..! డీఎస్సీ పోరు ఎఫెక్ట్ ?
ఏపీలో గతేడాది ప్రభుత్వం (AP Govt) నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తోంది. వీటిపై ప్రభుత్వం స్పందించి అధికారులతో పలుమార్లు వివరణలు కూడా ఇప్పించింది. అయినా వైసీపీ కొత్త ఆధారాలతో ఆరోపణలు చేస్తూనే ఉంది. అంతటితో ఆగకుండా డీఎస్సీ అక్రమాలకు కారణమని భావిస్తున్న కోచింగ్ సెంటర్ల వద్ద కూడా హంగామా చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఇవాళ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసేందుకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు కోచింగ్ సెంటర్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, రాజకీయాలకు, రాజకీయ కుట్రలకు ఇవి వేదిక కాకూడదని తెలిపింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఈ ప్రైవేటు కోచింగ్ సెంటర్లపై ఒత్తిడి తెస్తున్నట్టు గుర్తించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారని, నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని కోచింగ్ సెంటర్లు వ్యవహరిస్తున్న తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని పేర్కొంది. దురుద్దేశ పూర్వకంగా కొన్ని ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు తమ వద్ద పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్ధులపై ఒత్తిడి తెచ్చి ఈ తరహా ఆందోళనలకు, నిరసనలకు పాల్పడేలా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేయాల్సిన అభ్యర్ధులను రాజకీయ ప్రేరేపిత నిరసనలు, ఆందోళనలకు వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు.

తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే కొన్ని ప్రైవేటు కోచింగ్ సంస్థల యజమానులు దురుద్దేశంతో అభ్యర్ధులను నిరసనలకు, ఆందోళనల కోసం ప్రోత్సహించినట్టు తేలిందని ప్రభుత్వం తెలిపింది. ఈ అంశాలపై దృష్టి సారించిన సీఎం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటంపై చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. పోటీ పరీక్షలకు అభ్యర్ధులను సిద్ధం చేయాల్సిన ఈ కోచింగ్ కేంద్రాలు కొందరు అభ్యర్ధులను రాజకీయ పరమైన ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణా నిబంధనలు 2026 ప్రకారం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు జీవో నెంబర్ 9 లోని మార్గదర్శకాలకు అనుగుణంగా నడచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు మార్గదర్శకాలను పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.














Click it and Unblock the Notifications
