పేకాట (Bridge)కూ డీఎస్సీలో ఉద్యోగాలు? తేల్చేసిన ఏపీ సర్కార్..!
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం కూటమి ప్రభుత్వం (Ap Govt) నిర్వహించిన డీఎస్సీ పరీక్ష (DSC) లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో అధికారులు పదే పదే వివరణలు ఇస్తున్నారు. అయితే ఈసారి స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలకు పేకాట (Bridge Game)ను కూడా ఒక ఆటగా పరిగణనలోకి తీసుకోవడంపై విపక్ష వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. పేకాట ఆడితే కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేస్తారా అంటూ వేస్తున్న ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పందించింది.
సోషల్ మీడియాలో 'మెగా DSC' నియామకాలకు సంబంధించి, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా జాబితాలో 'బ్రిడ్జ్' (Bridge) క్రీడను చేర్చడంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనది అంటూ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు 'బ్రిడ్జ్' ఒక అధికారిక 'మైండ్ స్పోర్ట్' (Mind Sport)గా గుర్తింపు పొందిందని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల ప్రకారం, స్పోర్ట్స్ కోటాలో కేటగిరీ-A మరియు కేటగిరీ-B విభాగాల కింద క్రీడలను గుర్తించి జాబితా రూపొందించడం జరిగిందని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అధికారిక క్రీడా విభాగాల జాబితాలోనే 'బ్రిడ్జ్' ఉన్నందున, దానిని స్పోర్ట్స్ కోటాకు పరిగణనలోకి తీసుకోవడం అనేది నిబంధనలకు అనుగుణంగానే జరిగినట్లు వివరణ ఇచ్చింది. ఈ నియామకాలలో అక్రమాలు జరిగాయని, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. ఇవి నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న నిరాధారమైన ప్రచారాలు మాత్రమేనని పేర్కొంది. ప్రభుత్వ నియామక ప్రక్రియపై ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో అశాంతిని ప్రేరేపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్ మీడియా, మీడియాపై చట్టపరమైన విచారణ చేపట్టి, ఐటీ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించింది.














Click it and Unblock the Notifications