సీఎం విజయ్ స్వాతంత్ర్య దినోత్సవ కానుకలు- మేనిఫెస్టోలో లేనివి
దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్.. రాష్ట్ర ప్రజలకు కీలక వరాలు ప్రకటించారు. ఈ ఉదయం చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఫోర్ట్ పై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా విజయ్ మొదటిసారిగా స్వాతంత్ర్య వేడుకలలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ కానుకలను ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశ సేవలో నిమగ్నమైన మాజీ సైనికులు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల సంక్షేమమే ధ్యేయంగా పలు విప్లవాత్మక నిర్ణయాలను విజయ్ వెల్లడించారు. రాష్ట్రంలో అవినీతి రహిత, అత్యంత పారదర్శకమైన ప్రజాస్వామ్య పాలనను అందించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే అనే ఉన్నత భావనతో మహిళల రక్షణ, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వంతో అవసరమైన పాలనాపరమైన సహకారాన్ని కొనసాగిస్తూనే, స్థానికంగా ప్రజా సంక్షేమ పథకాల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశం కోసం అంకితభావంతో పోరాడిన యోధులను గౌరవిస్తూ వారి పెన్షన్లను భారీగా పెంచుతున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల నెలవారీ పెన్షన్ను రూ. 23,000, వారి కుటుంబ సభ్యులకు అందించే ఫ్యామిలీ పెన్షన్ను రూ.12,500కు పెంచామని అన్నారు.
వీరపాండ్య కట్టబొమ్మన్, మరుదు బ్రదర్స్ వంటి చారిత్రాత్మక స్వాతంత్ర్య వీరుల వారసులకు అందించే నెలవారీ ప్రత్యేక పెన్షన్ను సైతం రూ.11,500కు పెంచుతూ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. మాజీ సైనికుల కుమార్తెల వివాహ సమయాల్లో అందించే ఆర్థిక సహాయాన్ని రూ.25,000 నేరుగా రూ.50,000కు రెట్టింపు చేశారు. శారీరక వైకల్యంతో బాధపడుతున్న మాజీ సైనికులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందించే నెలవారీ ప్రత్యేక సహాయాన్ని రూ.5,000 నుండి రూ.7,000కు పెంచుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పోలీస్ స్టేషన్ సాధారణ ప్రజల సేవా కేంద్రాలుగా మారాలని విజయ్ అధికారులకు సూచించారు. కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా, అత్యంత గౌరవంతో వ్యవహరించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లను మరింత ఆధునికీకరిస్తామని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఉచిత అల్పాహార పథకాన్ని సెప్టెంబర్ 15 నుండి అధికారికంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత కృష్ణస్వామికి రూ. 10 లక్షల నగదు బహుమతితో కూడిన ప్రతిష్టాత్మక తగైసాల్ తమిళర్ అవార్డును అందజేశారు. డయాబెటిస్ పరిశోధకుడు డాక్టర్ వీ మోహన్ తరఫున ఆయన కుమార్తె డాక్టర్ అంజనకు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును ప్రదానం చేశారు విజయ్.














Click it and Unblock the Notifications