భోగాపురం ఎయిర్పోర్ట్ పై బెస్ట్ తెలుగు స్లోగన్స్ ఇవే.. ఇద్దరికీ చెరొక లక్ష రూపాయలు!
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ పైన బెస్ట్ తెలుగు స్లోగన్స్ పోటీ నిర్వహించారు. అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన రీల్స్, వీడియోస్ పోటీ కూడా నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత ప్రాచుర్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ముందు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే లక్షల నగదు బహుమతులను ప్రకటించి భోగాపురం ఎయిర్పోర్ట్ పైన పోటీలను నిర్వహించారు.
తెలుగు స్లోగన్స్ పోటీలో భారీగా పాల్గొన్న విద్యార్థులు
అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్ తెలుగు స్లొగన్స్ పోటీలలో విజేతలను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామచంద్ర రెడ్డి వెల్లడించారు. ఆగస్టు ఒకటవ తేదీన విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలలో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని మొత్తం ఆరువేల 199 మంది ఈ పోటీలో పాల్గొన్నారని, ఇద్దరికి ఓట్లు సమానంగా రావడంతో ఇద్దరిని విజేతలుగా ప్రకటించారు.

స్లోగన్స్ పోటీలో ఆరవతరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్థులు
వీరిద్దరికి చెరో లక్ష రూపాయలు నగదు బహుమతి అందజేయనున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి అందరినీ ఆకట్టుకునే విధంగా తెలుగులో బెస్ట్ స్లొగన్స్ రూపొందించి పంపాలని ఆరవ తరగతి విద్యార్థుల నుండి డిగ్రీ వరకు చదువుకున్న విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన విమానాశ్రయ ప్రభావాన్ని, ప్రత్యేకతను గొప్పతనాన్ని తెలియజేసేలా సంక్షిప్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఈ స్లొగన్స్ కాంటెస్ట్ లో భారీ స్థాయిలో పోటీపడ్డారు.
బెస్ట్ స్లోగన్స్ ఇవే
పల్నాడు జిల్లా వినుకొండ కు చెందిన బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని చెరుకూరి నాగసాయి లక్ష్మీ సూచించిన "ఉత్తరాంధ్రకు మణిహారం స్వర్ణాంధ్రకు శ్రీకారం" స్లోగన్ బెస్ట్ స్లోగన్ గా ఎంపిక అయింది. ఇది మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే విజయనగరం పిఎస్ఆర్ స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థిని ఏ శ్రీకైరవి సూచించిన "స్వర్ణాంధ్రకు ధ్రువతార- ఉత్తరాంధ్రకు ప్రగతి" తార స్లోగన్ రెండవదిగా ఎంపిక చేశారు.
త్వరలో వీరికి చెరొక లక్ష నగదు బహుమతి
అయితే మొత్తం పోటీకి వచ్చిన నినాదాలలో ముందు వంద నినాదాలను ఎంపిక చేశారు. ఆ తర్వాత వాటిలో 20 సెలెక్ట్ చేశారు. చివరగా జిల్లా స్థాయి కమిటీ టాప్ 20 ని పరిశీలించి అధికారులతో ఓటింగ్ నిర్వహించింది. ఈ ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో ఇద్దరినీ విజేతలుగా ఖరారు చేసినట్టు కలెక్టర్ రామచంద్ర రెడ్డి తెలిపారు. ఈ ఇద్దరికి త్వరలో సీఎంఆర్ ఎండి మావూరి వెంకటరమణ నగదు బహుమతిని అందజేస్తారని ఆయన తెలిపారు.














Click it and Unblock the Notifications