ఖైరతాబాద్ గణేష్ వద్ద పోటెత్తిన భక్తులు.. కిటకిటలాడుతున్న క్యూలైన్లు..!
హైదరాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఎటు చూసిన గణేష్ మండపాలు.. ఆట పాటలతో నగరం మొత్తం భక్తి పారవశ్యంతో ఊగిపోతుంది. గల్లీ గల్లీకి గణేష్ మండపాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక హైదరాబాద్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్.. ఈ ఏడాది ఖైరతాబాద్ లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. బడా గణేష్ దర్శనానికి 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు. దాంతో మహాగణపతి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది. అయితే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాటకు ఏ మాత్రం అవకాశం లేకుండా భక్తులను దర్శనానికి పంపిస్తున్నారు.
ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ ఒక్కరోజే సుమారు లక్షన్నరకు పైగా భక్తులు బడా గణేష్ ను దర్శించుకునే అవకాశం ఉందని ఉత్సవ కమిటీ, అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. మరోవైపు ఎండల కారణంగా నిన్న కొంత మంది భక్తులు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో అక్కడే ఉన్న వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మరికొంతమంది జనం ఒత్తిడితో ఉండలేక బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారికి సహకరించారు.

చాలా మంది భక్తులు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆర్టీసీ బస్సులు అలాగే ఆటోల్లో వస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి మండపం వచ్చే దారిలో రద్దీ బాగా పెరిగిందన్నారు. ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమెరాల నిఘా ఉంచడంతో పాటు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని వివరించారు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ లో 69 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి దర్శనమిస్తున్నారు. బడా గణేష్ తో పాటు కాళికామాత, సోమనాథ్ జ్యోతిర్లింగం, విశ్వకర్మ ,విష్ణుమూర్తి రూపాలు ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.












Click it and Unblock the Notifications
